సూత్రధారి సోమయాల రాజు.. అమలు యుగంధర్‌రెడ్డి

6 Oct, 2020 08:01 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న మాదాపూర్‌ డీసీపీ

రూ.30 లక్షల వరకు ఖర్చు చేస్తానన్న లక్ష్మారెడ్డి

ముగిసిన ప్రధాన నిందితుల కస్టడీ.. 

హేమంత్‌ కేసులో మరో నలుగురు అరెస్ట్‌

మరో ఏడుగురి కోసం కస్టడీ పిటిషన్‌ 

మరో ముఠాతో సంప్రదింపులపైనా విచారణ

మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడి

గచ్బిబౌలి(హైదరాబాద్‌): చింత యోగా హేమంత్‌ కుమార్‌ హత్య కేసులో మరో నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. అరెస్టు అయినవారిలో సూత్రధారి సోమయాల రాజు, సాయన్నతోపాటు హత్యలో పాల్గొన్న ఎరుకల కృష్ణ, మహ్మద్‌ పాషా ఉన్నారు. యుగంధర్‌ రెడ్డిని బావ లక్ష్మారెడ్డి, అక్క అర్చన కలిసి హేమంత్‌ అడ్డు తొలగించాలని అభ్యర్థించారు. దీంతో వట్టినాగులపల్లికి చెందిన సోమయాల రాజు(52), ఎరుకల కృష్ణ(33), మహ్మద్‌ పాషా అలియాస్‌ లడ్డూ(32), ఐడీఏ బొల్లారం నివాసి, రౌడీషీటర్‌ బ్యాగరి సాయన్న(48)లతో కలిసి హత్యకు పక్కా స్కెచ్‌ వేశాడు. రూ.10 లక్షల సుపారీకి రూ.50 వేలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు.

హేమంత్‌కు సంబంధించిన ఐదున్నర తులాల బంగారు బ్రాస్‌లెట్, చైన్‌ను ఎరుకల కృష్ణ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యుగంధర్‌ రెడ్డి, అవంతి తండ్రి లక్ష్మారెడ్డిల ఆరు రోజుల కస్టడీ సోమవారం ముగిసింది. అల్లుడు హేమంత్‌ను అడ్డు తొలగించేందుకు రూ.30 లక్షలైనా ఖర్చు చేసేందుకు లక్ష్మారెడ్డి సిద్ధపడ్డట్టు విచారణలో వెల్లడైంది. లక్ష్మారెడ్డి ఇంటి చుట్టూ సీసీ కెమెరాలను అమర్చి అవంతి బయటకు వెళ్లకుండా కట్టడి చేశాడు. అవంతి సోదరుడు అశీష్‌రెడ్డి పాత్రపై ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఆధారాలు లభిస్తే అశీష్‌రెడ్డిపై కేసు నమోదు చేస్తామని డీసీపీ వివరించారు. ఏ7 విజయేందర్‌ రెడ్డి, ఏ8 అర్థం రంజిత్‌ రెడ్డి, ఏ9 అర్థం రాకేష్‌ రెడ్డి, ఏ11 ఎల్లు సంతోష్‌రెడ్డి, 12 కైలా సందీప్‌ రెడ్డి, ఏ15 షేక్‌ సాహెబ్‌ పటేల్‌తోపాటు గూడూరు సందీప్‌రెడ్డిలను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 
(చదవండి: హేమంత్‌ హత్య కేసు: తొలిరోజు విచారణ)

అమ్మకు బాగాలేదని...
నిందితులు విజయేందర్‌రెడ్డి, స్పందన, రాకేష్‌రెడ్డి గచ్చిబౌలిలోని టీఎన్‌జీవోస్‌ కాలనీలో హేమంత్, అవంతిలను రెండుసార్లు కలిశారు. ‘నీవు ఇంటి నుంచి వెళ్లినప్పటి నుంచి అమ్మకు ఆరోగ్యం బాగాలేద’ని నమ్మించారు. పలుమార్లు ఫోన్‌లో మాట్లాడుతూ ప్రేమ ఉన్నట్లు నటించారు. మరోవైపు హేమంత్‌ హత్యకు లక్ష్మారెడ్డి, యుగంధర్‌రెడ్డి ప్లాన్‌ చేశారు. హత్యకు ముందు మరో గ్యాంగ్‌తో లక్ష్మారెడ్డి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఒప్పందం కుదుర్చుకున్న తరువాత ఆ ముఠా నుంచి స్పందన రాకపోవడంతో యుగంధర్‌రెడ్డి ద్వారా ప్లాన్‌ చేసినట్లు సమాచారం. మరో గ్యాంగ్‌తో మాట్లాడిన విషయంపైనా  విచారణ చేపట్టనున్నారు. 
ఎస్‌హెచ్‌వోతోపాటు మరో ఇద్దరికి కరోనా హేమంత్‌ హత్య కేసులో ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌గా ఉన్న ఎస్‌హెచ్‌వో ఆర్‌.శ్రీనివాస్‌కు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో డీఐ క్యాస్ట్రో ఐవోగా ఉంటాడని డీసీపీ తెలిపారు. హత్యకేసులో నిందితులైన ఎరుకల కృష్ణ, మహ్మద్‌ పాషాలకు టెస్ట్‌లు చేయగా పాజిటివ్‌ అని తేలినట్లు సామాచారం. 
(చదవండి: మొదటి భార్యకు విడాకులు.. రెండో భార్య కుమార్తెపై కన్ను)

మరిన్ని వార్తలు