హేమంత్‌ హత్య: కారులో చిత్రహింసలు

25 Sep, 2020 17:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హేమంత్‌ కుమార్‌ హత్య కేసుకు సంబంధించి సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అవంతి మేనమామ యుగంధర్‌ రెడ్డి, హేమంత్‌ హత్య కోసం పది లక్షల రూపాయల సుఫారీతో ఇద్దరు వ్యక్తులను రంగంలోకి దించినట్లు పోలీసుల విచారణలో తేలింది. యుగంధర్‌ రెడ్డి చందానగర్‌కు చెందిన ఆ ఇద్దరు కిరాయి హంతకులతో కలిసి హేమంత్‌ హత్యకు ప్లాన్‌ రచించాడు. మధ్యాహ్నం 3:30 గంటలకు గచ్చిబౌలి ఎన్జీవో కాలనీలో హేమంత్‌ను బలవంతంగా కిడ్నాప్ చేసి కారులో వేసుకెళ్లిపోయాడు. గోపన్ పల్లికి వెళ్లాక, ఆ కారులో నుంచి దింపి మరో కారులో ఎక్కించారు నిందితులు. తాడుతో చేతులు, కాళ్లు కట్టి కారు వెనక సీట్లో పడేసి చిత్రహింసలు పెట్టారు. ( మమ్మల్ని నమ్మించి మోసం చేశారు: అవంతి )

ఓఆర్ఆర్ మీదుగా సంగారెడ్డికి తరలించారు. తాడుతో హేమంత్‌ మెడను బిగేసి హత్య చేశారు. రాత్రి 7:30కే హత్య చేసి సంగారెడ్డి మల్కాపూర్‌లో పడేశారు. కాగా, హేమంత్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. కుటుంబసభ్యులు మృతదేహం పాడవకుండా ఉండేందుకు గచ్చిబౌలిలోని కాన్‌టినెంటల్ హాస్పత్రికి తరలించారు. రేపు చందా నగర్‌లో అంతక్రియలు జరుపుతామని తెలిపారు. ఈ నేపథ్యంలో యూకేలో ఉంటున్న హేమంత్‌ తమ్ముడు సుమంత్‌ అన్నయ్య కడసారి చూపుకోసం బయలుదేరాడు.

సినిమాలో హీరోగా హేమంత్‌
మృతుడు హేమంత్‌ కుమార్‌ ఓ సినిమాలోనూ నటించాడు. అందమైన మాయ అనే సినిమాలో హీరోగా చేశాడు. 2015 డిసెంబర్‌ 19వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

నిందితుల్లో ఒకరి కరోనా 
హేమంత్‌ హత్య కేసులో మొత్తం 13 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. శుక్రవారం నిందితులకు కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించగా ఓ నిందితుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.

మరిన్ని వార్తలు