డేటింగ్‌సైట్లు.. హైటెక్‌ వ్యభిచారం.. సిటీ యువతుల ఫొటోలు వాట్సాప్‌కు పంపి..

25 Aug, 2022 19:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి ప్రతినిధి కర్నూలు: మనీశ్‌ (పేరు మార్చాం) అనే ఒక ఇంజినీరింగ్‌ విద్యార్థి గూగుల్‌లోకి వెళ్లి ‘కాల్‌ గర్ల్స్‌ మొబైల్‌ నంబర్స్‌ ఇన్‌ కర్నూలు’ అని ఒక సైటు తెరిచారు. అందులో కొన్ని ఫోన్‌ నంబర్లు ఉన్నాయి. వాటిలో ఒక నంబర్‌కు ఫోన్‌ చేశారు. అవతలి వ్యక్తి హిందీలో మాట్లాడారు. సిటీ పేరు అడిగితే మనీశ్‌ కర్నూలు అని చెప్పాడు. రూ.10వేలు అవుతుంది.. అడ్వాన్స్‌గా రూ.5వేలు ఫోన్‌పేలో పంపాలని చెప్పారు. మనీశ్‌ ఫోన్‌ చేసిన నంబర్‌కు ఫొటోలు వాట్సాప్‌లో పంపారు.
చదవండి: ఏసీ టెక్నీషియన్‌ పాడుపని.. నమ్మించి యువతిని హోటల్‌కు తీసుకెళ్లి..

మోసపోతానేమోననే  భయంతో ఆన్‌లైన్‌లోని మరో నంబర్‌కు మనీశ్‌ ఫోన్‌ చేశాడు.   ఫొటోలు తెప్పించుకుని చూశాడు.  ఇలా నాలుగైదు నంబర్లు విచారించి ఫొటోలు చూసి ఒక నంబర్‌కు ఫోన్‌పే ద్వారా రూ.5వేలు పంపాడు. డబ్బులు పంపిన తర్వాత కర్నూలులోని మేడమ్‌ ఒకరు నీకు ఫోన్‌ చేస్తారు.. లొకేషన్‌ చెబుతారు.. అని    అవతలి వ్యక్తి చెప్పాడు. ఆ తర్వాత ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌!!  .. మనీశ్‌ ఒక్కడే కాదు ‘డేటింగ్‌ ఉచ్చు’లో పడి వేల మంది చితికిపోతున్నారు.

ఆధునిక యుగంలో అందరి చేతిలో స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. షాపింగ్‌ నుంచి బ్యాంకింగ్‌ వరకూ లావాదేవీలన్నీ మొబైల్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనే చేస్తున్నారు. ఇందులో అతిపెద్ద మోసం ‘ఆన్‌లైన్‌ డేటింగ్‌’! ప్రపంచవ్యాప్తంగా ఏడాదిలో 302 మిలియన్‌ డాలర్లు ఈ డేటింగ్‌ వల్ల నష్టపోతున్నారని ఎఫ్‌టీసీ(ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌) గణాంకాలు చెబుతున్నాయి. దీన్నిబట్టే ఇది ఏ స్థాయి కుంభకోణమో ఇట్టే తెలుస్తోంది.

జనాభా అధికంగా ఉండి, స్మార్ట్‌ఫోన్లను ప్రపంచంలో అత్యధికంగా వాడే ఇండియా, చైనాకే ఎక్కువ నష్టం వాటిల్లుతోంది. ఇండియాలో ఏడాదిలో ఏకంగా రూ.50 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని అంచనా. కర్నూలు, నంద్యాల జిల్లాలో 2019 నుంచి ఇప్పటి వరకు 1,637మంది బాధితులు రూ.8.77కోట్లు నష్టపోయారు. వీరంతా విధిలేక ఫిర్యాదు చేసిన వారే. భయంతో, పరువు పోతుందని పోలీసులను ఆశ్రయించనివారు వేలల్లో ఉంటారు. వీరు కనీసం రూ.వందకోట్లు నష్టపోయి ఉంటారు.  

డేటింగ్‌సైట్లలో వివరాల నమోదు 
ఆన్‌లైన్‌ బుకింగ్‌లో మరొక పద్ధతి ఉంది. డేటింగ్‌ సైట్‌ తెరవగానే అందులో పేరు, జెండర్, మెయిల్‌ ఐడీ వివరాలు ఎంటర్‌ చేయాలి. ఈ వెబ్‌సైట్‌లలోకి వెళితే ఉద్యోగానికి దరఖాస్తు చేసినట్లు మొత్తం వివరాలు ఆన్‌లైన్లో నమోదు చేయాలి. ఇందులో జెండర్, వయస్సు ఆధారంగా ప్రొఫైల్స్‌ ఉంటాయి. ఏ వయస్సు వారికి ఎంత వయస్సు ఉన్నవారు కావాలి? అమ్మాయి ఇన్‌కాల్‌ లేదా ఔట్‌కాల్‌ అనే ఆప్షన్‌ ఉంటుంది. అన్నీ పూర్తి చేసి అడ్వాన్స్‌గా డబ్బులు చెల్లించిన తర్వాత ఫోన్‌ నంబర్‌ పనిచేయదు. ఇలా 80 శాతం సైట్లు అడ్వాన్స్‌ పేరుతో నగదును బదిలీ చేయించుకుని ఆపై నంబర్‌ బ్లాక్‌ చేస్తారు.  

లోకల్‌ నంబర్‌.. హైటెక్‌ వ్యభిచారం  
డేటింగ్‌సైట్లలో కొందరు ఆన్‌లైన్‌ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. వీరు తెలుగులో మాట్లాడతారు. ఫొటోలు పంపాలంటే అడ్వాన్స్‌గా రూ. వెయ్యి ఫోన్‌పేలో పంపాలి. ఆపై ఓ వ్యక్తి ఫోన్‌ చేసి అడ్రస్‌ చెబుతారు. అక్కడకు వెళితే తీసుకెళతారు. అక్కడ ఫోన్‌లో మాట్లాడుకున్న డబ్బులు ఫోన్‌పేలోనే చెల్లించాలి. ఆపై అమ్మాయిలను చూపిస్తారు. ఆపై మళ్లీరేటు చెబుతారు. ‘అదేంటి? మాట్లాడుకున్న డబ్బులు చెల్లించాను కదా?’ అని అడిగితే ‘అది ఎస్కార్ట్‌చార్జ్‌(మీడియేటర్‌).

ఇక్కడ మేడం(కాల్‌గర్ల్‌)కు ఇవ్వాలి? లేకపోతే వెళ్లండి? అని తేల్చేస్తారు. ఎలాగూ డబ్బు  పోయిందని మరికొంత చెల్లిస్తారు. ఇలా హైటెక్‌ వ్యభిచారం నడుస్తోంది. ఎక్కువగా నార్త్‌ ఇండియా నుంచి పిలిపిస్తారు. కలకత్తా, డార్జిలింగ్, మణిపూర్, నాగాలాండ్, ముంబయి, గుజరాత్,  ఉత్తరప్రదేశ్‌ నుంచి యువతులు వస్తుంటారు. ఇన్‌కాల్, ఔట్‌ కాల్‌ సర్వీసు పేరుతో వారు హోటల్‌ లేదంటే పర్సనల్‌ రూంకు వచ్చే ఏర్పాటును ‘ఎస్కార్ట్స్‌’(మధ్యవర్తులు) చేస్తారు.

నొయిడా, గుర్గావ్, బిహార్, గుజరాత్, కలకత్తా నుంచి ఎక్కువగా డేటింగ్‌ నడుస్తోంది. మొబైల్స్‌కు వారే ఫోన్‌ చేస్తారు. డేటింగ్‌ తీరుతెన్నులు వివరిస్తారు. మీ ప్రాంతం ఏది? అని అడిగి, ఆ సిటీలోని కొన్ని ప్రాంతాల పేర్లు  చెబుతారు. అక్కడ కొంతమంది మేడమ్స్‌ ఉన్నారని, మెంబర్‌íÙప్‌ తీసుకుంటే వారి నంబర్లు ఇస్తామని, వారితో ఫోన్‌లో మాట్లాడి రిలేషన్‌ చేయొచ్చని ముగ్గులోకి దించుతారు. మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది మెంబర్‌షిప్‌లు ఉంటాయి. మూడు నెలలకు రూ.3,500, ఆరు నెలలకు రూ. 5 వేలు, ఏడాదికి రూ.7వేలు ఫీజు తీసుకుంటారు. డబ్బులు చెల్లించిన తర్వాత ఈ నంబర్లు కూడా పనిచేయవు.  

‘స్మార్ట్‌’ డీల్‌  
గూగుల్‌లోకి వెళ్లి ‘ఆన్‌లైన్‌ డేటింగ్‌’ అని టైప్‌ చేస్తే సైట్లు కన్పిస్తాయి. వీటితో పాటు ప్రాంతాన్ని బట్టి ‘కాల్‌గర్ల్స్‌ మొబైల్‌ నంబర్స్‌ ఇన్‌ కర్నూలు’ అని టైప్‌ చేస్తే ఫోన్‌ నంబర్లు ఉన్నాయి. ఫోన్‌ చేస్తే రేటు, ఇతర వివరాలు వివరిస్తారు. రేటు కుదిరాక వాట్సాప్‌లో ‘హాయ్‌’ అని టైప్‌ చేస్తే ఫొటోలు పంపిస్తారు. ఫొటోను బట్టి రేటు ఫిక్స్‌ చేస్తారు. అందులో కొంత మొత్తాన్ని అడ్వాన్స్‌గా ఆన్‌లైన్‌లో చెల్లించాలి.  

ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం ద్వారా లావాదేవీలు  
సమయాన్ని బట్టి రేటు నిర్ణయిస్తారు. ‘షార్ట్‌ టైమ్‌’(గంట), మూడు గంటలు, ఫుల్‌నైట్‌ అని మూడు రకాలు డీల్స్‌ ఉంటాయి. ఈ వివరాలు వాట్సాప్‌కు పంపిస్తారు. ఇందులో షార్ట్‌ టైంకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు, మూడు గంటలైతే రూ.7వేల నుంచి రూ. 10వేల వరకు, ఫుల్‌నైట్‌కు రూ.10వేల నుంచి రూ.15వేల వరకు నిర్ణయిస్తారు. సైట్లను బట్టి రేట్లలో తేడాలు ఉన్నాయి. అడ్వాన్స్‌గా కొంత మొత్తాన్ని ఫోన్‌పే ద్వారా చెల్లించాలి. డబ్బు పంపిన తర్వాత ఫోన్‌ పనిచేయదు. నంబర్‌ను బ్లాక్‌ చేస్తారు.  

ఫోన్‌పే, గూగుల్‌పే అకౌంట్లన్నీ ఫేక్‌  
ఈ తరహా నేరాలను ‘రొమాన్స్‌ స్కామ్స్‌’ ‘హనీట్రాప్‌’గా పోలీసులు పరిగణిస్తారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఇష్టపడరు. దీంతో పోలీసులు సైబర్‌ మిత్ర, పోలీసు వాట్సాప్‌ నంబర్‌కు ఫిర్యాదు చేసే అవకాశం ఇచ్చారు. డీజీ ఆఫీసు నుంచి ఈ ఫిర్యాదులను మానిటర్‌ చేస్తారు. వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతారు. ఈ తరహా నమోదైన కేసుల ఆధారంగా కర్నూలు జిల్లా పోలీసులు ఫోన్‌పే, గూగుల్‌పే వివరాలతో ఆ ప్రాంతాలకు వెళ్లారు. వివరాలు ఆరా తీస్తే  ఈ తతంగానికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల వివరాలు తెలుస్తున్నాయి. ఆధార్, బ్యాంక్‌ ఐడీలు వారికి తెలీకుండానే వారి ఐడీలతో ఫేక్‌ అకౌంట్లు సృష్టించారు. ఉత్తరప్రదేశ్‌ కేంద్రంగా ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

జీవితాలు ఛిన్నాభిన్నం 
ఇంజినీరింగ్‌తో పాటు ఉన్నత విద్య అభ్యసించే కొందరు విద్యార్థినులు, పేద కుటుంబాల నుంచి వచ్చి హాస్టళ్లలో చదివే మరికొందరు విద్యార్థినులు ఆర్థిక అవసరాల కోసం ఈ సైట్లలోకి వెళ్లి ఫోన్లు చేస్తున్నారు. ఫోన్‌లో మాట్లాడి, తమది ఫలానా సిటీ అని, డేటింగ్‌కు తాము సిద్ధమని మొబైల్‌ నంబర్లు ఇస్తున్నారు. వీరికి నార్త్‌ ఇండియన్స్‌ ఎస్కార్ట్స్‌గా ఉంటారు. ఫోన్‌ చేస్తే హిందీలో మాట్లాడతారు. సిటీని బట్టి, ఆయా సిటీలోని యువతుల ఫొటోలు వాట్సాప్‌కు పంపిస్తారు.

నగదు బదిలీ చేసిన తర్వాత యువతుల ఫోన్‌ నంబర్లు ఇస్తారు. వారు చెప్పిన అడ్రస్‌కు వీరు వెళతారు. అడ్వాన్స్‌ పోనూ మిగిలిన డబ్బులు యువతులకు చెల్లిస్తారు. ఈ తరహా వ్యవహారంలో చాలామంది యువతుల జీవితాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. పేదరికంతో ఆర్థిక అవసరాల కోసం కొందరు, విలాసాలతో ఇంకొందరు యవ్వనాన్ని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెడుతున్నారు. యువత భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని డేటింగ్‌ సైట్లను నిషేధించాలని పలువురు మేధావులు కోరుతున్నారు.   

మరిన్ని వార్తలు