హైటెక్‌ వ్యభిచారం గుట్టురట్టు

17 Nov, 2022 09:29 IST|Sakshi

మదనపల్లె (అన్నమయ్య జిల్లా) : వాట్సప్‌లో అందమైన యువతుల ఫొటోలు పంపి యువకులను ఆకర్షించి ఎవరికీ అనుమానం రాకుండా ఇళ్లమధ్య రహస్యంగా నడుపుతున్న హైటెక్‌ వ్యభిచారం గుట్టును మదనపల్లె టూటౌన్‌ పోలీసులు బయటపెట్టారు. వ్యభిచార నిర్వాహకురాలితో పాటు ఇద్దరు విటులను అరెస్ట్‌ చేసి యువతులను కౌన్సెలింగ్‌కు పంపనన్నట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు. పట్టణంలోని శివారుప్రాంతమైన చంద్రాకాలనీ గురుకుల పాఠశాల వెనుకవైపు అమ్మాజాన్‌ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారగృహం నిర్వహిస్తోంది.

బెంగళూరు, విజయవాడ, నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి, వారి ఫొటోలను వాట్సప్‌ ద్వారా విటులకు చేరవేయడం, ఫోన్‌లో బేరసారాలు సాగించడం,  లొకేషన్‌ షేర్‌ చేసి ఎవ్వరికీ అనుమానం రాకుండా రహస్యంగా దందా నిర్వహించేంది. ఫోన్‌ పే ద్వారా డబ్బులు తన ఖాతాకు వేయించుకుని వచ్చిన దాంట్లో సగం తనకు, మిగిలిన సగం యువతులకు ఇచ్చేది. ఈ క్రమంలో అమ్మాజాన్‌ ఇంటికి కొత్త వ్యక్తులు రాకపోకలు అధికమవడం, ఇటీవల కాలనీలో నిర్వహించిన కార్డన్‌సెర్చ్‌లో పోలీసులు అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఇవ్వాల్సిందిగా కోరడంతో స్థానికులు పోలీసులకు వ్యభిచారంపై సమాచారం అందించారు.

 ప్రజల నుంచి అందిన సమాచారం మేరకు పక్కా ప్లాన్‌ ప్రకారం అమ్మాజాన్‌ ఇంటిపై నిఘావేసి పకడ్బందీగా నిర్వాహకురాలు, ఇద్దరు విటులు, ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. అమ్మాజాన్, ఇద్దరు విటులైన సాదిక్‌(బసినికొండ), సతీష్‌(చింతపర్తి)లను అరెస్ట్‌ చూపుతూ ఇమ్మోరల్‌ ట్రాఫిక్‌(ప్రివెన్షన్‌) యాక్ట్, 1956 కింద కేసు నమోదుచేస్తున్నట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు. వీరి నుంచి మూడు సెల్‌ఫోన్లు, మూడువేల నగదు, కండోమ్‌ ప్యాకెట్స్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. యువతులకు కౌన్సిలింగ్‌ నిర్వహించి కుటుంబసభ్యులకు లేదా కోర్టులో హాజరుపరిచి తదుపరి ఆదేశాల ప్రకారం నడుచుకుంటామన్నారు. 

పట్టణంలో  అపరిచితులకు, కొత్తవ్యక్తులకు ఇళ్లు అద్దెకు ఇచ్చేటప్పుడు  వారి గురించి అన్ని వివరాలు, సరైన ఆధారాలు తీసుకుని ఇవ్వాలన్నారు. ప్రజల సహకారం లేనిదే నేరాల నియంత్రణ అసాధ్యమని,  ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లైతే మహిళా పోలీసులు, వలంటీర్లు, డయల్‌ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ చంద్రమోహన్, రామమూర్తి, రెడ్డిశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు