హృదయ విదారక ఘటన: నవజాత శిశువుని మెట్లపై వదిలేశారు

5 Oct, 2021 17:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సిమ్లా: పిల్లలు కలగాలని కొందరు దంపతులు ఆసుపత్రుల చుట్టు తిరుగుతుంటే.. మరికొందరు గుళ్ల చుట్టు తిరుగుతూ దేవుడికి మొక్కులు చెల్లింస్తుంటారనే విషయం మనకు తెలిసిందే. అయితే, దీనికి భిన్నంగా కొంత మంది మాత్రం..  తమకు పుట్టిన సంతానాన్ని వేర్వేరు కారణాలతో వదిలివేస్తున్న సంఘటనలను తరచుగా వార్తల్లో చూస్తుంటాం. నిన్న(సోమవారం) జరిగిన ఈ విషాదకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హిమచల్‌ ప్రదేశ్‌లోని సోలాన్‌ అనే ప్రాంతంలో ఒక శివాలయం ఉంది. ప్రతిరోజు ఉదయాన్నే ఆలయం ముందు నుంచి స్థానికులు వాకింగ్‌కు వెళ్తుంటారు. ఈ క్రమంలో సోమవారం ఒక చిన్నారి ఏడుపు వాకర్లకు వినిపించింది. దీంతో వారు అక్కడికి వెళ్లి చూశారు. ఆలయం మెట్లమీద ఒక నవజాత ఆడ శిశువు టవల్‌లో చుట్టి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఆ చిన్నారి చలికి వణికిపోతుంది.

వెంటనే స్థానికులు ఆలయ పూజారీ బ్రహ్మనంద్‌కు, పోలీసులకు సమాచారం అం​దించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి ఏవరో.. అని ఆరాతీస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నెలలు నిండకుండానే చిన్నారి పుట్టడం వలన వదిలేసుంటారని స్థానికులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ పూజారీ బ్రహ్మనంద్‌ చిన్నారిని.. తాను దత్తత తీసుకుని పెంచుకుంటానని గ్రామస్తులకు తెలిపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. 

చదవండి: బిడ్డ వేదనను చూడ లేక.. విషపు ఇంజెక్షన్‌ ఇచ్చి..

మరిన్ని వార్తలు