పని మనిషే హత్య చేసింది..

3 Mar, 2021 08:20 IST|Sakshi

సాక్షి, జిన్నారం(పటాన్‌చెరు) : కళ్లల్లో కారంచల్లి ఓ వృద్ధురాలి గొంతు నులిమి హత్య చేసిన కేసును బొల్లారం పోలీసులు ఛేదించారు.  పటాన్‌చెరు డీఎస్పీ భీంరెడ్డి మంగళవారం విలేకరుల సమావేశంలో హత్యకు గల కారణాలను వెల్లడించారు.  డీఎస్పీ కథనం మేరకు.. బొల్లారం గ్రామంలో ఒంటరిగా నివాసం ఉంటున్న ఉస్కేబావి అంతమ్మ ఇంట్లో స్వరూప అనే మహిళ పని చేస్తుంది. అంతమ్మ ఇంట్లో ఎప్పుడూ డబ్బు, బంగారు నగలను గమనిస్తున్న స్వరూప వాటిని అపహరించాలని పన్నాగం పన్నింది. ఆదివారం రాత్రి అంతమ్మతో పాటు ఇంట్లోనే స్వరూప నిద్రించింది. అంతమ్మ నిద్రలోకి చేరుకున్న తర్వాత స్వరూప నిద్ర లేచి అంతమ్మ కళ్లల్లో కారం చల్లి గొంతు నులిమి హత్య చేసింది.

ఇంట్లో ఉన్న 18 తులాల బంగారంతో పాటు రూ. 6లక్షల నగదును ఎత్తుకెళ్లింది. అంతమ్మ హత్యకు గురి కావటంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఇంటి పరిసర ప్రాంతంలో అర్ధరాత్రి ఓ మహిళ సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో పోలీసులు గుర్తించారు. అంతమ్మ ఇంట్లో పనిచేస్తున్న స్వరూపను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు. తానే హత్య చేసి నగదు, డబ్బును ఎత్తుకెళ్లినట్లు   ఒప్పుకుంది.   నగదుతో పాటు బంగారంను స్వాధీనం చేసుకొని స్వరూపను అరెస్టు చేసి రిమాండ్‌కు  తరలించినట్లు డీఎస్పీ వివరించారు. 24 గంటల్లో హత్య కేసును  ఛేదించేలా దర్యాప్తు జరిపిన సీఐ ప్రశాంత్‌తో పాటు సిబ్బందిని ఎస్పీ అభినందించినట్లు వివరించారు.   

మరిన్ని వార్తలు