మృతదేహాన్ని అనుమతించని ఇంటి యజమాని 

13 Mar, 2021 09:00 IST|Sakshi

పోలీసులు, స్థానికుల జోక్యంతో వరండాలో ఏర్పాట్లు 

మీర్‌పేట: అనారోగ్యంతో మృతి చెందిన మహిళ మతదేహాన్ని ఇంట్లోకి రానివ్వకుండా ఇంటి యజమాని అడ్డుకున్న సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... హయత్‌నగర్‌కు చెందిన సుధీర (51) భర్త కొంత కాలం క్రితం చనిపోయాడు. ఇద్దరు కుమారులు నిఖిల్‌సాగర్‌ (25), నిషాంత్‌ సాగర్‌ (22)లు ఉన్నారు. పదేళ్ల క్రితం జిల్లెలగూడ బాలాజీకాలనీలో అద్దెకు ఉంటున్నారు. సుధీర కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందింది.

దీంతో అంత్యక్రియల నిమిత్తం కుటుంబసభ్యులు మృతదేహాన్ని సాయంత్రం ఇంటికి తీసుకొచ్చారు. మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకునివ్వకుండా ఇంటి యజమాని నిరాకరించింది. దీంతో కుటుంబ సభ్యులు చేసేది లేక ఇంటి బయటే రోడ్డుపై టెంట్‌ వేసి మృతదేహాన్ని ఉంచారు. విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానిక నాయకులు జోక్యం చేసుకుని యజమానికి నచ్చజెప్పడంతో ఆ తరువాత కుటుంబసభ్యులు ఇంటి లోపలి వరండాలో మృతదేహాన్ని ఉంచి ఏర్పాట్లు చేసిన అనంతరం జిల్లెలగూడ శ్మశానవాటికిలో అంత్యక్రియలు నిర్వహించారు. 

పరస్పర దాడులు.. కేసు నమోదు
పహాడీషరీఫ్‌: కోర్టు కేసు ఉన్న భూ విషయమై రెండు గ్రూపులు దాడులకు పాల్పడిన సంఘటన పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పహాడీషరీఫ్‌కు చెందిన ఇర్ఫాన్, ఇమ్రాన్‌ గ్రూప్‌కు ఇజ్రత్‌ అలీ, విరాహసత్‌ అలీ మరో గ్రూప్‌ నడుమ భూ వివాదం నెలకొంది. ఈ స్థలంలో గురువారం ఇర్ఫాన్‌ అలీ, ఇమ్రాన్‌ అలీలు ప్రహరీ నిర్మాణం చేపట్టారు. విషయం తెలుసుకున్న మరో వర్గం అడిగేందుకు రాత్రి 10గంటలకు వెళ్లారు. ఈ సమయంలో రెండు గ్రూప్‌లు పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. అనంతరం ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య 
చాదర్‌ఘాట్‌: కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన చాదర్‌ఘాట్‌ పోలీస్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై గోపి తెలిపిన వివరాల ప్రకారం.. ఆజంపురాకు చెందిన విజయ్‌కుమార్‌ (39) పెయింటర్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం అర్ధరాత్రి భార్యను రూమ్‌లోంచి బయటకు నెట్టివేసి తలుపులు బిగించుకుని ఇనుపరాడ్డుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తమ్ముడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

చదవండి: చెట్టుపై కూర్చున్నట్లుగా యువతి మృతదేహం.. 

మరిన్ని వార్తలు