మంత్రి నివాసంలో హౌస్‌ కీపర్‌ ఆత్మహత్య

29 Aug, 2022 02:05 IST|Sakshi
దేవేందర్‌ 

నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌లో ఘటన 

ప్రేమ వ్యవహారమే కారణమని ఏసీపీ వెల్లడి

వేల్పూర్‌: నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండల కేంద్రంలో ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నివాసంలో హౌస్‌ కీపర్‌గా పనిచేసే ఇంటెనుక దేవేందర్‌ (18) అనే యువకుడు శనివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారమే అతని బలవన్మరణానికి కారణమని భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. వేల్పూర్‌లోని మంత్రి ప్రశాంత్‌రెడ్డి నివాసంలో ఇద్దరు హౌస్‌ కీపర్లు పనిచేస్తున్నారు.

మరో హౌజ్‌ కీపర్‌ గంగారాం.. బంధువు అంత్యక్రియల్లో పాల్గొనడానికి శనివారం వేరే గ్రామానికి వెళ్లగా.. దేవేందర్‌ మంత్రి ఇంట్లోనే ఉన్నాడు. ఆదివారం ఉదయం తిరిగి వచ్చిన గంగారాం ఎంత పిలిచినా దేవేందర్‌ స్పందించకపోవడంతో చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి చూడగా కింది అంతస్తులోని మంత్రి కార్యాలయంలో ఫ్యాన్‌కు వేలాడుతూ దేవేందర్‌ మృతదేహం కనిపించింది.

ఆర్మూర్‌ ఏసీపీ ప్రభాకర్‌రావు, ఎస్సై వినయ్‌ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు దేవేందర్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని పరిశీలించారు. ఓ స్త్రీతో ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా అంచనాకు వచ్చామని ఏసీపీ ప్రభాకర్‌రావు తెలిపారు. కొంతకాలంగా ఓ మహిళతో ప్రేమలో ఉన్న దేవేందర్‌.. వారం రోజులుగా తన వాట్సాప్‌ స్టేటస్‌లో ‘రిప్‌’అని పెట్టుకుంటున్నట్లు తెలిసిందన్నారు. శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆమెతో వాట్సాప్‌లో చాటింగ్‌ చేశాడని, నేను వెళ్తున్నా.. ప్రశాంతంగా ఉండు అని మెస్సేజ్‌ చేశాడని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు