పాపం అని ఉద్యోగం ఇస్తే.. అదును చూసి..

13 Aug, 2021 08:46 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పని కల్పించిన యజమాని ఇంటికే కన్నం 

రూ.10లక్షలతో ఉడాయించిన పని మనుషులు 

మలక్‌పేట(హైదరాబాద్‌): పని కల్పించిన ఓ యజమాని ఇంటికే కన్నం వేసిన సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. డీఐ నానునాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్‌కుమార్‌ అనే వ్యాపారవేత్త మూసారంబాగ్‌ ఎస్‌బీఐ ఆఫీసర్స్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. నేపాల్‌కు చెందిన అశోక్, రేఖ అనే ఇద్దరు వ్యక్తులను కొంత కాలంగా తన ఇంట్లో పనికి పెట్టుకున్నాడు. ఎంతో నమ్మకంగా ఉంటూ గురువారం కుటుంబ సభ్యులు పని మీద బయటకి వెళ్లారు.

ఇంట్లోని ఓ గదిలో వృద్ధురాలు మాత్రమే ఉంది. ఇదే అదనుగా భావించిన వారు మరో గదిలో ఉన్న బీరువా తాళాలు తెరచి అందులో ఉన్న రూ.10లక్షల నగదు దొంగలించి పరారయ్యారు. ఇంటికి వచ్చిన యజమాని కుటుంబ సభ్యులు తెరిచి ఉన్న బీరువా చూసి కంగుతున్నారు. అందులో ఉన్న రూ.10లక్షలు కన్పించలేదు. విజయ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు. మలక్‌పేట ఏసీపీ వెంకటరమణ ఘటన స్ధలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. 

మరిన్ని వార్తలు