అనిల్‌ను పట్టుకునేందుకు.. అమృత సాయంతోనే పోలీసుల వల.. ఏం జరిగిందంటే..

6 Jun, 2023 20:14 IST|Sakshi

క్రైమ్‌: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ సతీమణి అమృతను డబ్బు కోసం బ్లాక్‌మెయిల్‌ చేసిన కేసులో.. ముంబై పోలీసులు  ఎట్టకేలకు కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.  అయితే.. ఇందులో చాలా ఆసక్తికర విషయాల్నే పోలీసులు పొందుపరిచారు. ప్రధాన నిందితుడైన క్రికెట్‌ బుకీ అనిల్‌ జైసింఘానీని పోలీసులు.. అమృత సాయంతోనే ట్రేస్‌ చేసి పట్టుకున్నట్లు తెలిసింది. ఇందుకుగానూ .. అనిల్‌ కూతురు అనిక్షను నేరుగా కలవడంతో పాటుగా.. అమృత-అనిల్‌ మధ్య ఛాటింగ్‌ను సైతం పోలీసులు ఆ ఛార్జ్‌షీట్‌తో జత చేశారు.

అమృతా ఫడ్నవిస్‌ను బెదిరించి.. బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేసిన కేసులో అనిల్ జైసింఘానీ, అతని కుమార్తె అనిక్షపై పోలీసులు ఈ ఫిబ్రవరిలో కేసు నమోదు చేశారు. ఈలోపు అతని నేర చరిత్ర మొత్తం బయటపడింది. దాదాపుగా 15 కేసుల్లో నిందితుడిగా ఉన్న అనిల్‌.. ఎనిమిదేళ్ల నుంచి పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నాడట. దీంతో స్పెషల్‌ ఆపరేషన్‌ ద్వారా అతన్ని పట్టుకోవాలని ముంబై పోలీసులు డిసైడ్‌ అయ్యారు. అందుకు ఫడ్నవిస్‌ సతీమణి సాయం తీసుకున్నారు. 

ఫిబ్రవరి 24న ఛాటింగ్‌ 
అమృత:
‘‘మిమ్మల్ని అక్రమంగా కేసులో ఇరికిస్తే దాని గురించి.. నేను నా భర్త దేవేంద్ర ఫడ్నవిస్‌తో మాట్లాడతా. ఆయన మీకు న్యాయం చేస్తారు. కానీ, అక్రమంగా డబ్బు సంపాదించొచ్చన్న అనిక్ష డిమాండ్లను నేను అంగీకరించలేను. మీరు ముందు నుంచీ నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తూనే ఉన్నారు. నేను ఏ తప్పూ చేయలేదు. ఇప్పుడు మీరు నా వీడియోలను బయటపెట్టి నన్ను ఇరికించొచ్చు. కానీ, నిజాలు ఏదో ఒక రోజు బయటకు వస్తాయి. మీరు నిజంగా న్యాయం కోరుకుంటే దేవ్‌జీతో నేను మాట్లాడుతాను

అవతలి నుంచి: కొన్ని డాక్యుమెంట్లు, ఆడియో మెసేజ్‌లు రిప్లైగా వచ్చాయి.

ఆ తర్వాత అనిల్‌తో ఫోన్‌లో అమృత: ‘‘దేవేజీతో(భర్త దేవేంద్ర ఫడ్నవిస్‌ను ఉద్దేశించి) నా బంధం సరిగా లేదు. 2019 నుంచి మా మధ్య మనస్పర్థలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసు కారణంగా ఆయన నాకు విడాకులిస్తారేమో!. కానీ, ఆయన గురించి నాకు తెలుసు. మీరు బాధితులని తెలిస్తే.. ఆయన 100శాతం న్యాయం జరిగేలా చూస్తారు. 

మరోసారి కాల్‌లోనే: ‘‘ఫోన్‌లో కాదు.. నేరుగా మీ అమ్మాయి అనిక్షను కలిసి మాట్లాడతా’’

అలా అనిక్ష, ఆమె తండ్రి లొకేషన్‌ను పోలీసులు గుర్తించారు. ఈ కేసులో తొలుత మార్చి 16న అనిక్షను అరెస్టు చేయగా.. ఆ తర్వాత మార్చి 19న అనిల్‌ జైసింఘానీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఇదంతా ఆమె తనంతట తానుగా చేయలేదు.  ఇది కూడా పోలీసులే చెప్పమన్నారట. వాళ్ల డైరెక్షన్‌లోనే ఆమె ఇదంతా నడిపించారట. ఆ విషయాన్ని కూడా పోలీసులు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. 

దీనిపై ఓ దర్యాప్తు అధికారి మాట్లాడుతూ.. ‘‘మా సూచనలతోనే అమృతాజీ నిందితులతో టచ్‌లో ఉన్నారు. నిందితులను పట్టుకునేవరకు వారితో సంభాషణలు పొడగించాలని మేమే ఆమెకు చెప్పాం’’ అని తెలిపారు.

కేసు వివరాలివే..
అనిక్ష తనను తాను ఫ్యాషన్‌డిజైనర్‌గా అమృతా ఫడ్నవిస్‌తో పరిచయం పెంచుకుంది. ఆ వంకతో తరచూ వాళ్ల ఇంటికి వెళ్లేది. ఈ క్రమంలో ఆమె తండ్రి ఓ బుకీ అని తెలియడంతో.. అమృతా ఆ యువతిని దూరం పెట్టింది. అదిగో అప్పటి నుంచి అమృతను డబ్బు కోసం బెదిరించడం మొదలుపెట్టింది అనిక్ష. తన తండ్రిని కేసుల నుంచి బయటపడేందుకు సాయం చేయాలని, లేదంటే పరువు తీస్తానని బెదిరించింది. అమృతకు డబ్బు ఉన్న బ్యాగును ఇస్తున్నట్లుగా ఓ నకిలీ ఆడియో, వీడియో క్లిప్పులు సృష్టించి గుర్తుతెలియని ఫోన్‌ నంబర్ల ద్వారా బ్లాక్‌మెయిల్‌ చేసింది. దీంతో అమృత పోలీసులను ఆశ్రయించారు. ఆపై పోలీసులు అమృత సాయంతోనే వాళ్లను పట్టుకున్నారు.

మరిన్ని వార్తలు