సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ యోగిత అరెస్టు.. కీలక విషయాలు వెల్లడి

3 Oct, 2021 09:58 IST|Sakshi

నైజీరియన్‌ డ్రగ్‌ పెడ్లర్లకు గ్యాంగ్‌ లీడర్‌ 

బెంగళూరు కేంద్రంగా ఈమె వ్యవహారాలు 

ఇటీవల అరెస్టు చేసిన ఎన్సీబీ అధికారులు 

హైదరాబాద్‌లోనూ దందాలపై ఆధారాలు 

సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ యోగిత ‘డ్రగ్స్‌ డాన్‌’గా మారింది. ఆ నగరంతో పాటు హైదరాబాద్‌లోనూ నైజీరియన్లతో నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకున్న ఈమె మాదకద్రవ్యమైన ఎండీఎంఏ విక్రయాలు ప్రారంభించింది. దాదాపు మూడేళ్లుగా దందా చేస్తున్న యోగిత కోసం వలపన్నిన బెంగళూరు నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఇటీవల పట్టుకోగలిగారు. హైదరాబాద్‌లో ఈమె తరఫున డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న నైజీరియన్లకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు.

వినియోగం నుంచి విక్రేతగా మారి... 
బెంగళూరులో వివిధ పబ్స్‌కు వెళ్లే యోగిత డ్రగ్స్‌కు బానిసగా మారింది. వీటి ఉన్న డిమాండ్‌ తెలుసుకున్న ఆమె మూడేళ్ల క్రితం పెడ్లర్‌గా మారి విక్రయించడం మొదలెట్టింది. తనకు డ్రగ్స్‌ అమ్మిన నైజీరియన్లనే పెడ్లర్స్‌గా మార్చుకుని వారి ద్వారా వినియోగదారులకు అమ్మడం మొదలెట్టింది. కాలక్రమంలో అక్కడి నైజీరియన్లకు స్నేహితులైన హైదరాబాద్‌లో ఉంటున్న వారినీ ఏజెంట్లుగా మార్చుకుంది. డార్క్‌ వెబ్‌ ద్వారా ఆర్డర్లు ఇస్తూ, క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లింపులు చేస్తూ విదేశాల నుంచి భారీ స్థాయిలో డ్రగ్స్‌ను స్మగ్లింగ్‌ చేయిస్తోంది. ఈ వ్యవహారంపై మూడు నెలల క్రితమే ఎన్సీబీ అధికారులకు సమాచారం అందింది.  
(చదవండి: Marital Affair: వివాహేతర సంబంధం.. ఎంత చెప్పినా వినలేదు.. చివరికి)

జర్మనీ నుంచి ఇంటర్నేషనల్‌ పోస్టులో... 
యోగితకు సంబంధించిన చిరునామా, ఇతర వివరాలు తమ వద్ద లేకపోవడంతో అధికారులు వేచి చూశారు. ఈమెను పట్టుకోవడానికి విదేశాల నుంచి వచ్చే అనుమానాస్పద పార్శిల్స్‌పై నిఘా కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే గత నెల రెండో వారంలో బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ పోస్టాఫీసుకు జర్మనీ నుంచి వచ్చిన ఓ ఇంటర్నేషనల్‌ పోస్టు పార్శిల్‌పై ఎన్సీబీ దృష్టి పడింది. కాస్మోటిక్స్, శాండ్‌విచ్‌ గ్రిల్‌ తదతరాల పేరుతో వచ్చిన దాన్ని డెలివరీ చేయడానికి పోస్టుమ్యాన్‌ వెళ్లగా యోగిత చిరునామా లభించలేదు. దీంతో అతడు దాన్ని వెనక్కు తీసుకువచ్చాడు. దీనిపై సమాచారం అందుకున్న ఎన్సీబీ అధికారులు మూడు రోజుల పాటు ఆ పోస్టాఫీస్‌ వద్దే మాటు వేసి ఉన్నారు. మూడో రోజు పోస్టాఫీస్‌కు వచ్చిన యోగిత పార్శిల్‌ తీసుకువెళ్తుండగా పట్టుకున్నారు. 

రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు తరలింపు 
ఎన్సీబీ అధికారులు ఆ పార్శిల్‌ను విప్పి చూడగా అందులోని వస్తువుల మాటున అర కేజీ ఎండీఎంఏ ఉన్నట్లు గుర్తించారు. వివిధ దేశాల నుంచి ఇంటర్నేషనల్‌ పోస్టు ద్వారా వస్తువుల మాటున డ్రగ్స్‌ తెప్పిస్తున్నట్లు యోగిత అంగీకరించింది. ఇలా వచ్చిన వాటిని నైజీరియన్ల ద్వారానే బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు పంపుతున్నట్లు బయటపెట్టింది. ఇక్కడ ఉన్న ఆమె ఏజెంట్లు వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు ఎన్సీబీ ఆధారాలు సేకరించింది. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న ఆమె నెట్‌వర్క్‌ కోసం గాలిస్తున్న అధికారులు త్వరలో హైదరాబాద్‌ పెడ్లర్ల కోసం ఇక్కడకు రానున్నారని సమాచారం.   
(చదవండి: ‘తెలుగు అకాడమీ’ కుంభకోణంలో కొత్త కోణాలు! )

మరిన్ని వార్తలు