మేనకోడలితో వివాహేతర సంబంధం.. సినీఫక్కీలో భార్యను..

5 Feb, 2022 14:43 IST|Sakshi
హత్యకు గురైన లక్ష్మి.. నిందితుడు నాగరాజు.. కుమారుడు యశ్వంత్‌  

సాక్షి, కొత్తవలస (విజయనగరం): కొత్తవలస మండలం అప్పన్నదొరపాలెం పంచాయతీ జోడిమెరక గ్రామానికి చెందిన గిరిజనుడు జోడు నాగరాజు(33)..భార్య లక్ష్మిని తానే హత్య చేసినట్లు పోలీసుల ముందు శుక్రవారం అంగీకరించాడు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. తెర్లాం మండలం ఉద్దవోలుకు చెందిన లక్ష్మిని ఎనిమిదేళ్ల క్రితం నాగరాజు ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ బాబు యశ్వంత్‌(7) ఉన్నాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన నాగరాజు ఆమెను తరచూ వేధిస్తూ వివాహేతర సంబంధాలు అంటగడుతూ అదే గ్రామానికి చెందిన వరుసకు మేనకోడలు మౌనికతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్యాభర్తలు నిత్యం గొడవలు పడుతుండడంతో గ్రామస్తులు పలుమార్లు పంచాయితీ నిర్వహించి నాగరాజును మందలించారు.   

చదవండి: (తమ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని అమానుషం.. ఫొటోలు, వీడియోలు తీసి)

సినీఫక్కీలో హత్యకు పథకం 
భార్య లక్ష్మి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న నాగరాజు పథకం రచించి జనవరి 28న రాత్రి 7.30గంటల సమయంలో లక్ష్మి స్వీట్‌షాప్‌లో విధులు ముగించుకుని వస్తుండడంతో దారిలో కాపుకాసి తీర్థానికి రావాలని అడిగాడు. దీంతో నమ్మిన ఆమె భర్త స్కూటీ ఎక్కింది. తొలుత ఏపీ మోడల్‌స్కూల్‌ వైపు తీసుకువెళ్లగా అనుమానం వచ్చి బండిపైనుంచి భార్య దూకి పారిపోయే ప్రయత్నం చేసింది. తిరిగి ఆమెను స్కూటీపై ఎక్కించి బలిఘట్టం రెవెన్యూ పరిధిలోగల అర్ధాన్నపాలెం దారిలో జీడి తోటలోకి తీసుకువెళ్లి తనకు విడాకులు ఇవ్వాలని నాగరాజు కోరగా ఆమె తిరస్కరించడంతో బలంగా తోసేశాడు. దీంతో ఆమె రాళ్లకుప్పపై పడి స్పృహ కోల్పోయింది. అదే అదునుగా  రాయితో ఆమె తలపై కొట్టి హత్యచేసి అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా పక్కనే ఉన్న గోతిలో వేసి ఎండు పుల్లలు వేసి పెట్రోల్‌ పోసి తగుల బెట్టినట్లు నిందితుడు వాంగ్మూలంలో స్పష్టం చేశాడు.  

చదవండి: (సోషల్‌ మీడియా పరిచయం, పెళ్లి.. ఆ తర్వాతే అసలు కథ..)

స్టేషన్‌ ముందు గ్రామస్తుల ధర్నా
అభంశుభం తెలియని భార్య లక్ష్మిని వేధింపులకు గురిచేసి కిరాతకంగా హత్యచేసిన నాగరాజును ఉరితీయాలంటూ గ్రామస్తులు ధర్నాకు దిగారు. జోడిమెరక గ్రామ నుంచి గిరిజనులు నినాదాలు చేస్తూ కొత్తవలస  పోలీస్‌స్టేషన్‌కు ర్యాలీగా చేరుకుని ఆందోళన చేశారు.   

మరిన్ని వార్తలు