అనుమానంతోనే అంతమొందించారు..!

26 Feb, 2021 10:19 IST|Sakshi
విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న దర్శి డీఎస్పీ

గర్భిణి హత్య కేసులో భర్త, మామ అరెస్టు

విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించిన డీఎస్పీ

దర్శి టౌన్‌(ప్రకాశం జిల్లా):  పిల్లనిచ్చే వారు లేక కులాంతర వివాహం చేసుకున్నాడు. భార్యపై అనుమానం పెంచుకొని గొంతు నులిమి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ముండ్లమూరు మండలం ఉల్లగల్లులో ఈ నెల 21న గర్భిణి అనుమానాస్పద కేసులో భర్త, మామలను నిందితులుగా తేల్చి పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. కేసు పూర్వాపరాలను దర్శి డీఎస్పీ ప్రకాశరావు గురువారం విలేకరుల సమావేశంలో వివరించారు. ఉల్లగల్లు గ్రామానికి చెందిన కొండవీటి గురులింగం కుమారుడు శ్రీనివాసరావు..చిలకలూరి పేటకు చెందిన తన్నీరు వెంకాయమ్మ కుమార్తె శైలజను నాలుగేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. వారికి మూడేళ్ల బాబు ఉన్నాడు. ప్రస్తుతం శైలజ మూడు నెలల గర్భిణి.

ఈ క్రమంలో నెల రోజులు క్రితం శ్రీనివాసరావు పొలం నుంచి ఇంటికి వచ్చే సమయంలో అదే గ్రామానికి చెందిన ఒక యువకుడు శ్రీనివాసరావు నివాసంలో నుంచి పారిపోవడం గమనించాడు. నాటి నుంచి భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను చిత్ర హింసలకు గురిచేస్తూ ఉండటంతో ఈ నెల 16న పెద్దల సమక్షంలో భార్య భర్తలకు సర్ది చెప్పారు. అయితే అకస్మాత్తుగా ఈనెల 21న శైలజ పశువుల పాకలో శవమై కనిపించింది.

తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆమె శరీరంపై ఉన్న గాయాలు, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా విచారించారు. భర్త శ్రీనివాసరావు తహసీల్దార్‌ ఎదుట లొంగిపోయి నేరాన్ని ఒప్పుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. తన భార్య అక్రమ సంబంధం కారణంగా గ్రామంలో తమ పరువు పోతుందని భావించి నిద్రపోతున్న సమయంలో  కాలుతో తొక్కి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు డీఎస్పీ వివరించారు. కేసు దర్యాప్తులో ప్రతిభ చాటిన వారిని డీఎస్పీ అభినందించారు.
చదవండి:
ఎందుకిలా చేశావు తల్లీ...  !
దారుణం: అమ్మానాన్నలే అమ్మేశారు..

 

>
మరిన్ని వార్తలు