మూడేళ్ల క్రితం భార్య.. నేడు భర్త.. అదే ట్రాక్టర్‌.. మరో విషాదం..

8 Sep, 2022 09:03 IST|Sakshi
నరేష్‌

మాడుగులపల్లి(నల్లగొండ జిల్లా): మూడేళ్ల క్రితం పంచాయతీ ట్రాక్టర్‌ ఒక మహిళను బలి తీసుకుంటే.., నేడు అదే వాహనం మృత్యుశకటమై ఆమె భర్త మరణానికి కూడా కారణమైంది. నల్లగొండ జిల్లాలో జరిగిన ఈ విషాద సంఘటన వివరాలివి. మాడుగులపల్లి మండల పరిధిలోని కన్నెకల్‌ గ్రామానికి చెందిన గంటెకంపు నరేష్‌ (32)సౌందర్య దంపతులకు ఇద్దరు సంతానం. నరేష్‌ గ్రామ పంచాయతీ కార్మికుడిగా, సౌందర్య ఐకేపీలో పనిచేస్తుండేవారు.
చదవండి: ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకుని పాటలు వింటూ.. ఇంతలోనే షాకింగ్‌ ఘటన

మూడేళ్ల క్రితం సౌందర్య ఐకేపీ పని నిమిత్తం పంచాయతీ ట్రాక్టర్‌లో మిర్యాలగూడకు వెళ్లి తిరిగి వస్తుండగా వేములపల్లి మండలం శెట్టిపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. బుధవారం నరేష్‌ గ్యారకుంటపాలెంలో నిర్మిస్తున్న సీసీ రోడ్డుకు అదే ట్రాక్టర్‌కు అమర్చిన ట్యాంకర్‌లో నీటిని తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో గ్యారకుంటపాలంలోని విద్యుత్‌ తీగ ట్యాంకర్‌ పై భాగాన తగలడంతో నరేష్‌ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఒకే ట్రాక్టర్‌ దంపతుల్ని కబళించడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. 

మరిన్ని వార్తలు