విషాదం: భరించరాని నొప్పి.. చెప్పుకోలేని బాధ

17 Oct, 2020 08:19 IST|Sakshi

సాక్షి,  బెల్లంపల్లి: పన్నెండేళ్లపాటు ప్రేమించి, పెళ్లి చేసుకున్న వారి జీవనప్రయాణం పదినెలల్లోనే అర్ధాంతరంగా ముగిసింది. బెల్లంపల్లిలోని సుభాష్‌నగర్‌కు చెందిన మోసం మల్లేష్‌కుమార్‌ (36), బాబుక్యాంపు బస్తీకి చెందిన నర్మద (28) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్రంగా కలిచివేసింది.  నర్మద మందమర్రి గురుకులంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. మల్లేష్‌ ఓ ప్రైవేట్‌ టీవీ ఛానల్‌లో రిపోర్టర్‌. పెళ్లయిన కొద్ది నెలలకే దంపతులిద్దరికీ అనారోగ్య సమస్యలు ఏర్పడ్డాయి. వాటిని ఎలా భరించాలో తెలియక.. చనిపోదామనే నిర్ణయించుకున్నారు. గురువారం అర్ధరాత్రి దాటాక (12.40 గంటల ప్రాంతంలో) మల్లేశ్‌ తన సన్నిహితులైన కొందరికి వాట్సాప్‌ మెసేజ్‌ చేశాడు. పోచమ్మ చెరువు కట్ట వద్దకు బైక్‌ వచ్చి అందులో దూకారు. కొద్దిసేపటికి మిత్రులు మెసేజ్‌ చూసి వారికోసం వెదకడం ప్రారంభించారు. చెరువు కట్ట వద్ద బైక్‌ కనిపించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శుక్రవారం ఉదయం ఏసీపీ ఎంఏ రహమాన్, వన్‌టౌన్‌ ఎస్‌హెచ్‌ఓ రాజు, తహసీల్దార్‌ కుమారస్వామి గజ ఈతగాళ్లను రప్పించారు. మల్లేశ్‌ మృతదేహం 11 గంటలకు బయటపడగా.. నర్మద మృతదేహం కోసం గజ ఈతగాళ్లు శ్రమించాల్సి వచ్చింది. చివరకు సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని బయటకు తీయించారు. వారి మృతదేహాలను చూసి ఇరు కుటుంబాలు బోరున విలపించాయి. మిత్రులు, సన్నిహితులు కన్నీరుపెట్టుకున్నారు. చదవండి: (పెళ్లంటూ ఎర... గిఫ్టంటూ టోకరా! )

కలచివేసిన సూసైడ్‌ నోట్‌
“నా కుటుంబ సభ్యులను, నా ప్రాణమిత్రులను, అందరిని వదిలి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది. రోజురోజుకూ నా ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. రోజు నరకం చూస్తున్న. భరించరాని నొప్పి. చెప్పుకోలేని బాధ. ఈ లోకాన్ని వదిలి వెళ్లడం తప్ప వేరే మార్గం లేదు. కడుపునొప్పితో రోజూ నరకం చూస్తోంది. ఇలా బతకడం కంటే చావడం మేలని ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. నా నిర్లక్ష్యం, జర్నలిజం వృత్తియే నా అనారోగ్యానికి కారణం అనుకుంటున్న. సమయానికి తినక ఎన్నోసార్లు టెన్షన్‌కి గురయ్యాను. నా ప్రాణమిత్రులు, విలేకరులు నాకుటుంబానికి బాసటగా నిలవాలని వేడుకుంటున్న. అని సూసైడ్‌ నోట్‌లో రాసి ఉంది. “అమ్మను, అన్నయ్యను, అక్కలను మంచిగా సూసుకో, నీదే బాధ్యత, నీకు కొడుకుగానో, బిడ్డగానో పుడుత’ అని తన తోబుట్టువు శ్రీనివాస్‌ను ప్రాధేయపడిన తీరు కలిచివేసింది. అలాగే వారు తీసుకున్న అప్పులు.. తమ వద్ద అప్పు తీసుకున్నవారి వివరాలను కూడా అందులో రాసి పెట్టారు. 

మరిన్ని వార్తలు