కట్టుకున్నోడే కడతేర్చాడు

5 Mar, 2021 09:25 IST|Sakshi
ధ్వంసం చేసిన ధనశేఖర్‌ ఇల్లు  

పోలీసు విచారణలో వెలుగు చూసిన వాస్తవం

నిందితుడి అరెస్ట్‌.. మరో ఇద్దరిపై కేసు 

కట్టుకున్న భార్యను కడతేర్చాడు. ఆత్మహత్య చేసుకున్నట్లు ఆధారాలు సృష్టించాడు. నెపం వేరేవారిపై నెట్టేందుకు మరో వ్యక్తి ఇంటిపై దాడికి పాల్పడ్డాడు. తీరా పోలీసులు విచారణలో అసలు నిజం వెలుగుచూడడంతో కటకటాలు లెక్కిస్తున్నాడు.

పుత్తూరు(చిత్తూరు జిల్లా): మండలంలోని ఉత్తరపు కండ్రిగలో బుధవారం భానుప్రియ(26) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విచారణ చేపట్టిన పోలీసులు భర్త నారాయణమూర్తే భార్యను హత్యచేశాడని గురువారం తేల్చేశారు. పోలీసుల కథనం మేరకు.. నగరి మండలం నెత్తంకండ్రిగకు చెందిన భానుప్రియను నారాయణమూర్తి ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. వారికి మహీధర్‌(6), బాబి(4) అనే ఇద్దరు పిల్లలు. ఈ క్రమంలో భానుప్రియను స్థానికులైన ఉపాధ్యాయుడు గోపి, ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ ధనశేఖర్‌ వేధిస్తుండేవారు. దీంతో అనుమానం పెంచుకున్న నారాయణమూర్తి సైతం భార్యను ఇబ్బందిపెట్టేవాడు.

దీనిపై మూడురోజుల క్రితం భానుప్రియ పోలీసులకు ఫిర్యాదు సైతం చేసింది. ఆగ్రహించిన నారాయణమూర్తి భార్యతో బలవంతంగా సూసైడ్‌ నోట్‌ రాయించి, ఉరేసి చంపేశాడు. ఏమీ ఎరగనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం ధనశేఖర్‌ ఇంటిపై బంధువులతో కలిసి దాడి చేసి తగులబెట్టాడు. చివరకు నారాయణమూర్తే అసలు నిందితుడని తెలియడంతో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అలాగే భానుప్రియను వేధించిన గోపి, ధనశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ధనశేఖర్‌ ఇంటిపై దాడి చేసినందుకు నారాయణమూర్తి, అతడి బంధువులపై మరో కేసు నమోదు చేశారు.
చదవండి:
ఏయ్‌.. నవ్వకండి.. చిర్రెత్తిన బాలయ్య    
భర్తను చంపి.. ఇంటి పెరట్లో పాతిపెట్టి.. 

 

మరిన్ని వార్తలు