వివాహమై 18 ఏళ్లు.. భార్యపై అనుమానంతో..

30 Jul, 2021 08:57 IST|Sakshi

సాక్షి, బెల్లంపల్లి(ఆదిలాబాద్‌): అనుమానంతో భార్యను గొంతుకోసి హతమార్చిన సంఘటన  గురువారం బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. వన్‌టౌన్‌ ఎస్‌హెచ్‌వో ముస్కే రాజు వివరాల ప్రకారం... అశోక్‌నగర్‌ బస్తీకి చెందిన ఆసిఫ్‌ లారీ డ్రైవర్‌. ఇటీవల డ్రైవర్‌ పనికి వెళ్లకుండా ఇంటిపట్టున ఉంటున్నాడు. భార్య షాహిన్‌(39)పై అనుమానం పెంచుకున్నాడు. హత్య చేయాలని పథకం ప్రకారం.. ఇంట్లో ఉన్న కొడుకు సోహెల్‌ను బ్యాంక్‌కు పంపించాడు. కూతురు తమన్న స్నానం చేయడానికి బాత్‌రూమ్‌కు వెళ్లింది.

అదే అదునుగా భావించిన ఆసిఫ్‌ టీవీ సౌండ్‌ను పెంచి కత్తితో భార్య షాహిన్‌ గొంతుకోశాడు. అంతటితో ఆగకుండా రక్తం మడుగులో పడిపోయిన భార్య చనిపోయిందో లేదోనని కత్తితో కడుపులో విచక్షణ రహితంగా పొడిచాడు. ఆ తర్వాత షాహిన్‌ చనిపోయిందని నిర్థారించుకుని ఆసిఫ్‌ వన్‌టౌన్‌కు వెళ్లి పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. సంఘటన స్థలాన్ని ఏసీపీ ఎంఏ రహెమాన్‌ సందర్శించారు. మృతురాలి తల్లి సుల్తానాతో ప్రత్యేకంగా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ రాజు తెలిపారు. కుమారుడు పదో తరగతి, కూతురు తొమ్మిదో తరగతి చదువుతోంది. 

గతం నుంచే గొడవలు...
కాగజ్‌నగర్‌కు చెందిన ఆసిఫ్‌కు 18ఏళ్ల క్రితం బెల్లంపల్లికి చెందిన షాహిన్‌తో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. అప్పటి నుంచి బెల్లంపల్లిలోనే రూంను అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఆసిఫ్‌ పని చేయకుండా ఇంటి వద్దనే ఉండడంతో ఇరువురి మధ్య గొడవలు మొదలయ్యాయి. పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి. తన పద్ధతి మార్చుకుంటానని ఆసిఫ్‌ నమ్మబలకడంతో పోలీస్‌స్టేషన్‌లో కేసును సైతం షాహిన్‌ ఉపసంహరించుకుంది. 

మరిన్ని వార్తలు