Husband Kills Wife: కట్టుకున్న భర్తే కడతేర్చాడు..

2 Jul, 2021 07:50 IST|Sakshi

సాక్షి, జైపూర్‌(ఆదిలాబాద్‌): కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. మంత్రాల నెపంతో భార్యను భర్త అతికిరాతకంగా హత్య చేసిన సంఘటన జైపూర్‌ మండలం నర్సింగాపూర్‌లో కలకలం రేపింది. జైపూర్‌ మండలం నర్సింగాపూర్‌ గ్రామానికి చెందిన కాతం లక్ష్మి(55) అనే గృహిణిని భర్త కాతం లింగయ్య గురువారం ఉదయం ఇంట్లో గొడ్డలితో నరికి అతికిరాతంగా హత్య చేశాడు. అదనపు ఎస్సై గంగారాజాగౌడ్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింగాపూర్‌ గ్రామానికి చెందిన కాతం లక్ష్మి–లింగయ్య దంపతులకు ఇద్దరు కుమారులు వేణుగోపాల్, రమేశ్, కుమార్తె రమాదేవి ఉన్నారు. లింగయ్య సింగరేణి సంస్థలో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందాడు. అయితే కొన్నిరోజుల నుంచి లింగయ్య అనారోగ్యానికి గురికాగా.. తన భార్య లక్ష్మి మంత్రాలు చేస్తున్నట్లుగా అనుమానం పెంచుకున్నాడు.

ఈక్రమంలో ఇంట్లో భార్యభర్తలు రోజుమాదిరిగా నిద్రించగా.. గురువారం ఉదయం గాఢనిద్రలో ఉన్న లక్ష్మిని లింగయ్య గొడ్డలితో నరికి హత్య చేశాడు. తల, మెడ భాగంలో బలమైన గాయాలు కావడంతో లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటన స్థలాన్ని జైపూర్‌ ఏసీపీ నరేందర్, శ్రీరాంపూర్‌ సీఐ సంజీవ్‌ పరిశీలించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. నిందితుడు లింగయ్య పరారీలో ఉన్నాడని వారు తెలిపారు. కొడుకు వేణుపాల్‌ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా అదనపు ఎస్సై గంగారాజాగౌడ్‌ వెల్లడించారు. 

చదవండి: వామ్మో.. లోదుస్తుల్లో రూ.31 లక్షల విలువైన బంగారం..

మరిన్ని వార్తలు