క్షణికావేశం.. భార్య మద్యం తాగి రావడంతో..

29 Mar, 2021 09:18 IST|Sakshi

సాక్షి, పాచిపెంట: భార్యాభర్తల మధ్య మద్యం వివాదం పెద్దదైంది. క్షణికావేశంలో భర్త దాడిచేయడంతో భార్య తనువుచాలించిన విషాదకర ఘటన పాచిపెంట మండలం మాతుమూరు సమీపంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖ జిల్లా అరకు మండలం పూజారిపుట్టు గ్రామానికి చెందిన మర్రి శోభన్‌ (30), భార్య మర్రి తులసి(24) ఏడాది కిందట నుంచి మాతుమూరులోని ఓ రైతుకు చెందిన పామాయిల్‌ తోటలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. తులసి తన తల్లితో కలిసి శనివారం ఉదయం సాలూరు వెళ్లింది.

మద్యం సేవించి సాయంత్రం ఇంటికి వచ్చింది. మద్యం సేవించడంపై భర్త శోభన్‌ మందలించాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఈ నేపథ్యంలో తాము నివసిస్తున్న ప్రదేశానికి కొంత దూరం భార్యను తీసుకెళ్లి మోహంపై కర్రతో కొట్టాడు. తీవ్రగాయాలైన తులసి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న సాలూరు సీఐ ఎల్‌.అప్పలనాయడు సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని ఆదివారం పరిశీలించారు. కేసు నమోదు చేసినట్టు హెచ్‌సీ ప్రసాద్‌ తెలిపారు. 
చదవండి: ‘నేను చనిపోతున్నా.. నా చావుకు ఎవ్వరూ కారణం కాదు..’

మరిన్ని వార్తలు