భర్త అల్లిన కట్టుకథ.. మహిళ హత్య కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌

3 Nov, 2022 08:41 IST|Sakshi
రోజా (ఫైల్‌)- (ఇన్‌సెట్‌)లో నిందితుడి అరెస్ట్‌ చూపుతున్న డీఎస్పీ గంగయ్య, సీఐ

గంగవరం(చిత్తూరు జిల్లా): మండలంలో రెండు రోజుల క్రితం జరిగిన వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. మొగుడే భార్యను రేషన్‌ కట్టర్‌తో కిరాతకంగా హత్య చేసినట్లు నిర్ధారించారు. డీఎస్పీ గంగయ్య బుధవారం నిందితుడి అరెస్ట్‌ చూపించి వివరాలు వెల్లడించారు. మండలంలోని మల్లేరు గ్రామానికి చెందిన యాదగిరికి అదేగ్రామానికి చెందిన రోజాకు 2019లో వివాహమైంది. రోజాకు పుట్టింటివారు కానుకగా ఇచ్చిన బంగారు నగలను ఆమెకు తెలియకుండానే యాదగిరి అమ్మేశాడు.
చదవండి: మొదటి ప్రియుడిపై హత్యాయత్నం.. టీవీ సీరియల్‌ నటి అరెస్టు

విషయం తెలుసుకున్న రోజా తన నగలను తెచ్చివ్వాలంటూ భర్తను నిలదీసేది. ఈ క్రమంలో భర్తతో పాటు, అతని తమ్ముడు చోళరాజు, అత్తమామలు ఆమెను వేధించేవారు. కొన్నాళ్ల తరువాత అత్తమామలతో గొడవ పడి తన భర్తతో కలిసి ఇంటి పక్క నే ఉన్న రేకుల ఇంటిలోకి మకాం మార్చింది. ఆదివారం ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవైంది. దీంతో ఆగ్రహించిన యాదగిరి మల్బరీ ఆకును కత్తిరించే పెద్ద కట్టర్‌ను తీసుకొచ్చి రోజా గొంతుపై బలంగా నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

అయితే  భార్య మెడలోని బంగారు తాళిబొట్టు, చెవి పోగులు తీసుకెళ్లి కోళ్లషెడ్డులో దాచాడు. తరువాత పక్కింటిలో ఉన్న తల్లిదండ్రులతో తన భార్యను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపి నగలు దోచుకెళ్లారని కథ అల్లాడు. ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి, ఐడీ పార్టీ సిబ్బంది చేపట్టిన దర్యాప్తులో భర్తే అసలు దోషిగా నిర్ధారణైంది. నిందితుడు యాదగిరిని అదుపులోకి తీసుకుని, హత్యకు వినియోగించిన కట్టర్, బంగారు నగలు, సెల్‌ఫోన్‌ను స్వా«దీనం చేసుకున్నారు. భర్త, అత్తమామలను కీలపట్లలో అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. 

మరిన్ని వార్తలు