దారుణం: ముగ్గురూ అమ్మాయిలే పుట్టారని.. 

28 Sep, 2021 02:11 IST|Sakshi
పల్లవి, భర్త వెంకటేశ్, మొదటి కుమార్తె (ఫైల్‌)

భార్యను చంపేసిన భర్త 

గద్వాల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

గద్వాల క్రైం: వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టడమే ఆమెకు శాపంగా మారింది. కోపం పెంచుకున్న భర్త ఆమె ఉసురుతీశాడు. చిన్నారులకు తల్లి ప్రేమానురాగాలను దూరం చేశా డు. ఈ ఘటన గద్వాలలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... వనపర్తి జిల్లా మదనాపురానికి చెందిన అన్నపూర్ణ అలియాస్‌ పల్లవి(26)కి గద్వాలకు చెందిన వెంకటేశ్‌తో రెండేళ్ల క్రితం వివాహమైంది. ఏడాది క్రితం మొదటి సంతానం పాప జన్మించింది.

ఈ నెల 24న ఇద్దరు ఆడపిల్లలు(కవలలు) పుట్టారు. దీంతో భార్యపై వెంకటేశ్‌ ద్వేషం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆదివారం ఇంట్లో నిద్రిస్తున్న భార్య గొంతు నులిపేస్తుండగా కేకలు వేసింది. ఇరుగుపొరుగువారు వచ్చి నిలదీయగా ఫిట్స్‌ వచ్చాయని నమ్మించేందుకు ప్రయత్నించాడు. స్థానికులు ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. అతని మాటల్లో పొంతన లేకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు సోమవారం పోలీసులకు సమాచారమిచ్చారు.

గద్వాల సీఐ షేక్‌ సయ్యద్‌బాషా, తహసీల్దార్‌ లక్ష్మి, వైద్యుల సమక్షంలో పల్లవి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా ఆమెను పథకం ప్రకారమే హత్య చేసినట్టు తేలింది. మృతురాలి తండ్రి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు అల్లుడు వెంకటేశ్, అతని తల్లి జయమ్మ, బావ జనార్దన్, చెల్లెలు లీలావతిలపై కేసు నమోదు చేశారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. నిందితుడు మల్దకల్‌ ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. 
(చదవండి: AP: ఇద్దరు యువతులను కాపాడిన ‘దిశ’)

మరిన్ని వార్తలు