భార్యను చంపి.. ఆపై భర్త ఆత్మహత్య

5 Jun, 2021 08:22 IST|Sakshi

శ్రీకాళహస్తి రూరల్‌(చిత్తూరు జిల్లా):  మండలంలోని జగ్గరాజుపల్లె దళిత కాలనీలో భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటనపై రూరల్‌ ఎస్‌ఐ వెంకటేష్‌ కథనం.. కాలనీలో యానాది రామయ్య(60), లల్లమ్మ(50) దంపతులు నివసిస్తున్నారు. వీరికి మణి(30), చిలకమ్మ(27), ఇంద్రజ(25), రోజా(24), వెన్నెల(23), మోహన్‌(19), సంధ్య(16), అపర్ణ(15), గంగోత్రి(13) అనే తొమ్మిది మంది సంతానం. భార్యభర్తలు గొర్రెలను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రామయ్యకు మద్యం అలవాటు ఉండడంతో  తరచుగా దంపతులు గొడవపడేవారు. ఈ క్రమంలోనే ఏడాది క్రితం రామయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.

సకాలంలో ఆస్పత్రిలో చేర్చడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం  గొర్రెలు మేపడానికి రామయ్య వెళ్లాడు. మధ్యాహ్నం లల్లమ్మ కూడా  భర్త దగ్గరకు వెళ్లింది. అక్కడ ఇద్దరి మధ్య  ఘర్షణ జరగడంతో  రామయ్య కత్తితో లల్లమ్మపై దాడి చేసి చంపేశాడు. ఏమీ ఎరగనట్లు సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. అతడి వెంట లల్లమ్మ లేకపోవడంతో అమ్మ ఎక్కడ అని పిల్లలు అడిగారు. వెంటనే వచ్చేసిందే ఇంకా రాలేదా అని రామయ్య వారిని ఎదురు ప్రశ్నించాడు. పంపించేశాను ఇంకా రాలేదా అంటూ వారిని ఎదురు ప్రశ్న వేశాడు. అనంతరం అర్ధరాత్రి సమయంలో రామయ్య ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ పైకి ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. లల్లమ్మ కనబడకపోవటంతో శుక్ర వారం స్థానికులు గాలించగా  గుంటలో శవమై కనిపించింది. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

చదవండి: ‘గారాల పట్టి.. మేము ఎలా బతికేది తల్లీ’   
ఎంత ముద్దుగా ఉన్నావు తల్లి.. అమ్మే అంతపని చేసిందా?!

మరిన్ని వార్తలు