సంసార విషయంలో గొడవ .. భర్త ఆత్మహత్య 

9 Dec, 2021 12:00 IST|Sakshi

సాక్షి, పటాన్‌చెరు(మెదక్‌): సంసార విషయంలో జరిగిన గొడవ భర్త ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైంది. ఈ సంఘటన పటాన్‌చెరు పోలీసు స్టేషన్‌పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం తాలూక అంబాజీ పేటకు చెందిన శ్రీనివాస్‌(46) భార్య వరలక్ష్మి పిల్లలతో కలసి బతుకుదెరువు కోసం 18 ఏళ్ల క్రితం పటాన్‌చెరు పట్టణంలోని శ్రీనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నాడు.

ఓ ప్రైవేట్‌ పరిశ్రమలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఇంట్లో సరుకులు లేవని భార్య వరలక్ష్మి భర్తతో గొడవపడి ఇద్దరు కూతుర్లు సాయిప్రసన్న, శ్రీదేవిలను తీసుకొని మార్కెట్‌కు వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి బెడ్రూంలో చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించాడు.

వెంటనే కిందకు దించి ఆటోలో పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు