ఏమైందో ఏమో తెలియదు.. కత్తిపీటతో గొంతు కోసుకున్న భర్త..

15 Nov, 2021 10:18 IST|Sakshi

సాక్షి, నూతనకల్‌(నల్లగొండ): కత్తిపీటతో గొంతుకోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నూతన్‌కల్‌లో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...మండల కేంద్రానికి చెందిన బొడ్డుపల్లి రాములు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడి భార్య ప్రభుత్వ ఉద్యోగి. వీరి ఇద్దరు పిల్లలు హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. కాగా, రాములు భార్య శిక్షణ నిమిత్తం రెండు రోజులుగా నల్లగొండలో ఉంటోంది.

అయితే, ఏమైందో ఏమో తెలియదు కానీ రాములు ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తిపీటతో గొంతు కోసుకున్నాడు. ఇంట్లో అలికిడి వినపడడంతో పక్కనే నివాసం ఉంటున్న తండ్రి సాయిలు వెళ్లి చూశాడు. కుమారుడు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుండడంతో కేకలు వేశాడు. ఇరుగుపొరుగు వారు వచ్చి రాములును సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడినుంచి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.  

మరిన్ని వార్తలు