నా భార్య తాగి హింసిస్తోంది: రక్షించండి!

19 Sep, 2020 17:43 IST|Sakshi

అహ్మదాబాద్‌ : తన భార్య బాగా తాగి హింసిస్తోందని, ఆమె నుంచి రక్షణ కావాలని పోలీసులను ఆశ్రయించాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన గుజరాత్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుడు పోలీసులకు తెలిపిన వివరాల మేరకు.. అహ్మదాబాద్‌, మనినగర్‌కు చెందిన ఓ వ్యక్తికి 2018లో వివాహమైంది. పెళ్లి తర్వాత భార్య తాగుతుందని తెలిసిందతనికి. ఆమె తాగినపుడు అతడ్ని, అతడి తల్లిదండ్రుల్ని బాగా తిట్టేది.. భర్తను కొట్టేది కూడా. దీంతో అతడు శారీరకంగా, మానసికంగా బాగా కుంగిపోయాడు. దానికి తోడు బాగా తాగి అతడు పనిచేసే దగ్గరకు వచ్చి గొడవ కూడా చేసేది. ముసలివారైన అతని తల్లిదండ్రుల్ని వదిలి వేరేగా ఉండటానికి ఒత్తిడి తేవటంతో ఆమె పోరు పడలేక దూరంగా ఉంటున్నాడు. ( తాగుబోతు తల్లి వేధింపులు భరించలేక..)

ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం ముసలి వాళ్లకు కరోనా సోకడంతో అతడు వారి వద్దకు వచ్చేశాడు. ఆ తర్వాత ఆమె కుట్రపూరితంగా భర్త, అతడి తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి ఇంటి మొదటి అంతస్తులో ఉంటున్న ఆమె తాగి వచ్చి అతడ్ని కొట్టేది. మహిళా హెల్ప్‌లైన్‌ నెంబర్లకు ఫోన్‌ చేసి భర్తపై తప్పుడు ఆరోపణలు చేసేది. దీంతో విసిగిపోయిన అతడు గురువారం పోలీసులను ఆశ్రయించాడు. తాగుబోతు భార్యనుంచి తనను రక్షించాలని, పోలీస్‌ ప్రొటెక్షన్‌ ఏర్పాటు చేయాలని వారిని కోరాడు.

మరిన్ని వార్తలు