యూపీలో దారుణం.. దళిత వ్యక్తి సజీవ దహనం

30 Oct, 2020 20:07 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. అప్పు తీర్చలేదనే నేపంతో కొందరు వ్యక్తులు దళితుడిని సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి మరణించాడు. మృతుడి భార్య గ్రామ్‌ ప్రధాన్‌(సర్పంచ్)‌ కావడం గమనార్హం. ఈ ఘటన శుక్రవారం అమేథీలోని మున్షిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బందోయియా గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన అర్జున్‌ కోరి(40)కి.. మరి కొందరికి మధ్య డబ్బుకు సంబంధించి వివాదం తలెత్తింది. ఈ క్రమంలో గురువారం 5-6గురు వ్యక్తులు కలిసి అర్జున్‌ కోరిని చంపేందుకు ప్రయత్నించారు. బతికి ఉండగానే అతడిని సజీవ దహనం చేయాలని భావించి నిప్పు పెట్టారు. ఈ నేపథ్యంలో రాత్రి 10:30 గంటల ప్రాంతంలో బాధితుడి ఇంటి సరిహద్దు ప్రాంతంలో కాలిపోయిన స్థితిలో ఉన్న అర్జున్‌ని కుటుంబ సభ్యులు గుర్తించారు. తక్షణమే అతడిని చికిత్స కోసం నౌగిర్వాలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు అతడిని సుల్తాన్‌పూర్‌ జిల్లా ఆస్పత్రికి అక్కడి నుంచి లక్నో ట్రామా సెంటర్‌కు తరలించారు. కానీ దురదృష్టవషాత్తు ఆస్పత్రికి చేరేలోపే అతడు మరణించాడు. (బర్త్‌డే పార్టీలో ఓవరాక్షన్‌ : సింగర్‌పై కాల్పులు)

ఈ సందర్భంగా గ్రామ పెద్ద(సర్పంచ్‌), బాధితుడి భార్య ప్రత్యర్థులే ఈ హత్య చేశారని తెలిపింది. ఐదురుగిరి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్రామ పంచాయతీ సభ్యులు మాత్రం డబ్బుల కోసమే అర్జున్‌ కోరిని హత్య చేశారని తెలిపారు. ఇక ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంగటనలు చోటు చేసుకోకుండా చూసేందుకు గ్రామంలో భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. ఈ సందర్భంగా పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘విషయం తెలిసిన వెంటనే మేం సంఘటన స్థలానికి చేరుకుని గ్రామ్‌ ప్రధాన్‌ భర్తను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాము. ఈ రోజు ఉదయం లక్నో ట్రామా సెంటర్‌కు తీసుకెళ్తుండగా.. అతడు మరణించాడు’ అని తెలిపారు. బాధితుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదుగురిలో ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు