నా చావుకు ఎవరూ కారణం కాదు! అంటూ సెల్ఫీ వీడియో పంపి..

11 Jan, 2023 10:23 IST|Sakshi

సాక్షి, కణేకల్లు:  తన చావుకు ఎవరూ కారణం కాదంటూ భార్యకు వీడియో సందేశాన్ని పంపి భర్త కనిపించకుండా పోయాడు. వివరాలు.. కణేకల్లు మండలం యర్రగుంట గ్రామానికి చెందిన మల్లికార్జున, జయలక్ష్మి దంపతులు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. యర్రగుంట బస్టాండ్‌ ప్రాంతంలో సెల్‌ఫోన్ల మరమ్మతు దుకాణాన్ని మల్లికార్జున నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యం బారిన పడిన అతను ఈ విషయాన్ని భార్యకు కూడా తెలపలేదు. డాక్టర్‌ వద్దకు ఒక్కడే వెళ్లి చికిత్స చేయించుకుని వచ్చేవాడు.

మంగళవారం ఉదయం తాను దుకాణానికి వెళుతున్నట్లు ఇంట్లో తెలిపి బయటకు వచ్చిన అతను.. ద్విచక్ర వాహనంపై మాల్యం – నాగేపల్లి గ్రామాల మధ్య ఉన్న హెచ్చెల్సీ గట్టుకు చేరుకున్నాడు. అనంతరం కాలువ గట్టుపై నిల్చోని తన చావుకు ఎవరూ కారణం కాదని, ఆరోగ్యం బాగాలేకపోవడంతో జీవితంపై విరక్తితో కాలువలో దూకి చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసి భార్యకు పంపాడు.

ఆలస్యంగా ఈ సందేశాన్ని గమనించిన భార్య జయలక్ష్మి తీవ్ర ఆందోళనకు గురైంది. విషయాన్ని వెంటనే కుటుంబసభ్యులకు, బంధువులకు, పోలీసులకు చేరవేయడవంతో అందరూ ఆగమేఘాలపై కాలువ గట్టుకు చేరుకున్నారు. అక్కడ మల్లికార్జున ద్విచక్ర వాహనంతో పాటు సెల్‌ఫోన్, షర్ట్‌ లభ్యమయ్యాయి. కుటుంబసభ్యులు కాలువ వెంబడి గాలింపు చేపట్టారు. ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.     

(చదవండి: అంతా క్షణాల్లోనే.. రెండు కుటుంబాల్లో అంతులేని శోకం)

మరిన్ని వార్తలు