భర్త వివాహేతర సంబంధం: భార్య, పిల్లలు జలసమాధి

24 Mar, 2021 07:18 IST|Sakshi

సాక్షి, బళ్లారి: కుటుంబ కలహాలను తట్టుకోలేక ఓ తల్లి ఇద్దరు పిల్లలతో కలిసి వ్యవసాయ కుంట(ఫారంపాండ్‌)లోకి దూకి ప్రాణాలు తీసుకున్న ఘటన బాగలకోటె జిల్లా బాదామి తాలూకా హళకుర్కిలో మంగళవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఫక్కీరమ్మ(35), కుమారుడు నీలకంఠ (12), కుమార్తె కల్పన(10)అనే ముగ్గురు ఇంటి నుంచి గుడికి వెళ్లి అనంతరం ఇంటికి తిరిగి వస్తూ ఓ పొలంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.

భార్యాపిల్లలు కనిపించకపోవడం భర్త గాలించినా ఆచూకీ దొరకలేదు. మృతదేహాలు నీటి మీద తేలడంతో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఫక్కీరమ్మను హింసించేవాడని, అందువల్లే ఆమె ప్రాణాలు తీసుకుందని సమాచారం. కొడుకు నీలకంఠ పుట్టుమూగ. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బాదామి పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

చదవండి: జీవితంపై విరక్తి.. నవవధువు ఆత్మహత్య 

మరిన్ని వార్తలు