Macharam Sarpanch వేరే మహిళతో భర్త సంబంధం.. సర్పంచ్‌ తట్టుకోలేక..

26 Sep, 2021 13:03 IST|Sakshi

ఎంత చెప్పినా వినకపోవడంతో బలవన్మరణం

మహబూబ్‌నగర్‌ జిల్లాలో జడ్చర్లలో ఘటన

జడ్చర్ల టౌన్‌: కుటుంబ కలహాలతో ఓ మహిళా సర్పంచ్‌ ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలంలోని మాచారానికి చెందిన సిరి (28)కి నసురుల్లాబాద్‌తండా వాసి శ్రీనివాస్‌తో 11 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే కొన్నేళ్లుగా భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకోవడంతో కలహాలు మొదలయ్యాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోగా పలుమార్లు గొడవలు జరిగి పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లింది.

అయినా భర్త వైఖరిలో మార్పు రాకపోవడంతో మనోవేదనకు గురైన భార్య వారం కిందట ఇంట్లోనే గడ్డిమందు తాగింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందింది. శనివారం సాయంత్రం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని తండాకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటనతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతురాలి సోదరుడు శంకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జడ్చర్ల పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, ఆమె భర్త ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.

సర్పంచ్‌ల సంఘం సంతాపం
నసురుల్లాబాద్‌తండా సర్పంచ్‌ సిరి మృతిపై సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్‌చందర్, మండల అధ్యక్షుడు బాల్‌సుందర్‌ తదతరులు సంతాపం వ్యక్తం చేశారు. జెడ్పీ వైస్‌చైర్మన్‌ కోడ్గల్‌ యాదయ్యతో పాటు సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర నాయకులు తండాలో రాత్రి జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తాము అండగా ఉంటామని పిల్లలకు భరోసా కల్పించారు.

మరిన్ని వార్తలు