అర్ధరాత్రి వరకు ఫోన్‌ మాట్లాడుతున్న భార్య.. దీంతో..

5 May, 2021 13:35 IST|Sakshi

సాక్షి, పటాన్‌చెరు(హైదరాబాద్‌): కలకాలం కష్టసుఖాల్లో తోడూనీడగా ఉంటానని ప్రమాణం చేసి.. అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యనే కొట్టిచంపాడు. ఈ ఘటన పటాన్‌చెరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామానికి చెందిన సురేశ్‌ పాశం మైలారం పారిశ్రామికవాడలో ఓ ప్రైవేట్‌ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పదేళ్ల క్రితం సురేశ్‌కు అదే గ్రామానికి చెందిన స్వప్న(31)తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు.

సురేశ్‌ సోమవారం రాత్రి ఇంటికొచ్చే సరికి భార్య స్వప్న ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించింది. దీంతో అనుమానం వచ్చిన సురేశ్‌ ఆమెను తీవ్రంగా కొట్టాడు. గాయాలపాలై ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగా సురేశ్‌ తల్లిదండ్రులు స్వప్న తమ్ముడు లక్ష్మణ్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే అతడు వచ్చి స్వప్నను చికిత్స కోసం ఇస్నాపూర్‌ ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యుల సూచన మేరకు పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. లక్ష్మణ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సురేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.   

మరిన్ని వార్తలు