అమానుషం: భార్యకు కరోనా అని తెలిసి..

11 Aug, 2020 06:37 IST|Sakshi
పరారైన భర్త మంజునాథ్‌ (ఫైల్‌), కరోనాతో మృతి చెందిన భార్య గౌరి

భార్యకు కరోనా అనగానే పరార్‌  

ఇంట్లోనే చనిపోయిన యువతి

బెంగళూరులో అమానుషం

సాక్షి, బెంగళూరు: ధర్మార్థ కామ మోక్షాలతో తోడునీడగా ఉంటానని అగ్నిసాక్షిగా తాళికట్టిన భర్త, భార్యకు చిన్న కష్టం రాగానే పారిపోయాడు. ఆ అభాగ్యురాలు వైద్యమందక మరణించగా కడసారి చూపునకు కూడా అతడు రాలే­దు. కరోనాపై ఉన్న అపో­హలు మానవ సంబంధాలను ఛిద్రం చేస్తున్నాయనడానికి ఈ దారుణం ఒక సజీవ ఉదాహరణ. ఎక్కడో మారుమూలన కాదు, ఐటీ సిటీ బెంగళూరులోనే ఈ ఘోరం జరిగింది. 

ఏం జరిగిందీ: వివరాలు.. జేపీ నగర, శంకరమఠ వార్డులో గౌరి (27), మంజునాథ్‌ దంపతులు ఉంటున్నారు. రెండేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు ఉత్తర కర్ణాటక ప్రాంతం నుంచి ఉపాధి కోసం వచ్చి బాడుగ ఇంట్లో జీవిస్తున్నాడు. భార్య ఒక షాపింగ్‌ మాల్‌లో సేల్స్‌ ఉమెన్‌గా, భర్త మరోచోట డ్రైవర్‌గా పనిచేసేవాడు. బుధవారం ఆమెకు జ్వరం రాగా, ఒక ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకొని వచ్చారు. ఆమెకు కరోనా పాజిటివ్‌ అని ఫోన్‌ చేసి చెప్పారు. దీంతో భర్త మరుక్షణమే భార్యను వదిలిపెట్టి ఉడాయించాడు. ఆమెకు శ్వాసకోశ సమస్య అధికం కాగా, ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆమె శుక్రవారం ఇంట్లోనే మృతిచెందింది. (కరోనా మిగిల్చిన విషాదం..!)

కార్పొరేటర్‌ చొరవ  
శనివారం ఇంటి యజమాని గమనించగా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటి యజమాని, స్థానిక కార్పొరేటర్‌ శివరాజ్‌లు పలుమార్లు మంజునాథ్‌కు ఫోన్‌ చేసినప్పటికీ స్పందించలేదు. చివరికి ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసుకున్నాడు. ఇక మృతురాలి బంధువులకు ఫోన్‌ చేసి చెప్పగా, ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్లినరోజు నుంచే సంబంధం తెగిపోయిందని చెప్పేశారు. చివరకు కార్పొరేటర్‌ తదితరులే కార్పొరేషన్‌ అంబులెన్స్‌ను రప్పించి అంత్యక్రియలు జరిపించారు. ఘరానా భర్తపై శంకరమఠ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. (ప్రియుడితో పారిపోయి.. భర్తపై నెపం వేసి)

మరిన్ని వార్తలు