భార్యకు వేరొకరితో వివాహేతర సంబంధం.. అనుమానం ఉన్మాదిని చేసింది

23 Feb, 2023 10:06 IST|Sakshi

బెంగళూరు: భార్య, ఇద్దరు పిల్లలపై దాడి చేసి వారిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడో ప్రబుద్దుడు. ఈ ప్రమాదంలో  ముగ్గురూ సజీవ దహనమయ్యారు. ఈ దారుణ సంఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా శిడ్లఘట్ట తాలూకా హెణ్ణూరులో జరిగింది. నేత్రావతి (37), కుమార్తెలు స్నేహ (11), హర్షిణి (9)లు మరణించారు. అక్రమ సంబంధం అనుమానమే ఈ మారణకాండకు కారణంగా భావిస్తున్నారు.  

గొడవపడి దారుణం  
వృత్తిరీత్యా  భర్త సొణ్ణేగౌడ (48) వ్యవసాయం చేస్తుండగా, భార్య నేత్రావతి గృహిణి. పిల్లలు 5, 3 తరగతులు చదువుతున్నారు. భార్యకు వేరొకరితో వివాహేతర సంబంధం ఉందని సొణ్ణేగౌడ అనుమానించేవాడు. మంగళవారం రాత్రి ఈ విషయమై భార్యతో తీవ్రంగా గొడవపడ్డాడు. కోపం పట్టలేక ఉన్మాదిగా మారాడు. భార్య, ఆ తర్వాత పిల్లలపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. మంటల్లో కాలుతున్న వారి అరుపులు విన్న స్థానికులు వచ్చి వాటిని ఆర్పేసేందుకు ప్రయత్నించారు. అయితే మంటలు ఉవ్వెత్తున రావడంతో ప్రయత్నం ఫలించలేదు. నిమిషాల్లోనే తల్లీ కూతుళ్లు తీవ్రంగా కాలిపోవడంతో ప్రాణాలు వదిలారు.  

నిందితుడు ఆత్మహత్యాయత్నం  
అప్పటికే సొణ్ణేగౌడ ఇంట్లోని పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. తీవ్ర అస్వస్థతకు గురైన అతన్ని బెంగళూరుకు తరలించారు. సంఘటన స్థలానికి శిడ్లఘట్ట గ్రామీణ పోలీసులు చేరుకుని పరిశీలించారు. ముగ్గురి మృతదేహాలను శిడ్లఘట్ట ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. చిక్కబళ్లాపుర ఎస్పీ డీఎల్‌ నాగేశ ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. భార్యభర్తలు తరచు గొడవలు పడుతున్నా, ఇంత దారుణం జరుగుతుందని ఊహించలేదని గ్రామస్తులు వాపోయారు.
నేత్రావతి, పిల్లలు స్నేహ, హర్షిణి (ఫైల్‌)   

మరిన్ని వార్తలు