అనుమానంతోనే..ప్రాణం తీశాడు! 

27 Mar, 2021 14:25 IST|Sakshi
భర్త, పిల్లలతో వెంకట నారాయణమ్మ (ఫైల్‌)

రోకలి బండతో మోది భార్యను చంపిన భర్త 

చీమకుర్తి (ప్రకాశం జిల్లా): ఆ జంట ఎనిమిదేళ్లు కలిసి కాపురం చేసింది. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత దంపతులు తమ అనుబంధం మరిచారు. కనీసం పిల్లలు ఉన్నారన్న సోయ ఆ భర్తకు కలగలేదు. కట్టుకున్న భార్యను రోకలి బండతో తలపై బలంగా బాది నిలువునా ప్రాణం తీశాడు. విషయం బయటకు పొక్కటంతో మర్రిచెట్లపాలెం ఘొల్లుమంది. చీమకుర్తి మండలం మర్రిచెట్లపాలెం గ్రామానికి చెందిన అంకాల గురవయ్య తన భార్య వెంకట నారాయణమ్మ(35) హత్య చేశాడు. మండలంలోని మర్రిచెట్లపాలెంలో శుక్రవారం తెల్లవారు జామున ఈ సంఘటన జరిగింది.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. స్థానికంగా వలంటీర్‌గా విధులు నిర్వహించడంతో పాటు వేరే వారి సెల్‌షాపులో టెక్నీషియన్‌గా పని చేస్తున్న అంకాల గురవయ్య తన భార్య వెంకట నారాయణమ్మపై అనుమానం పెంచుకున్నాడు. భార్య స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తూ డ్వాక్రా మహిళా సంఘాల్లో వీఓఏగా కూడా పని చేస్తోంది. కొంత కాలంగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న గురవయ్య తరుచూ ఆమెతో ఘర్షణకు దిగుతుండేవాడు.

దర్శి మండలం లంకోజనపల్లికి చెందిన నారాయణమ్మన తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వారికి ఎనిమిదేళ్ల ఉమేష్‌, ఆరేళ్ల భవ్యశ్రీ ఉన్నారు. ఏమైందో ఏమో శుక్రవారం తెల్లవారు జామున 5.30 గంటలకు ముందుగానే నిద్ర లేచిన గురవయ్య ఇంట్లోనే ఉన్న రోకలిబండతో బలంగా భార్య తలకు ఎడమ వైపు కొట్టాడు. ఆ దెబ్బకు నారాయణమ్మ ప్రాణాలు గాలిలోనే కలిసిపోయాయి. మృతదేహం ఉన్న మంచం కింద రక్తపు మడుగులు స్థానికులను ఆందోళను గురిచేసింది. హత్య చేసిన గురవయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సంఘటన స్థలాన్ని సీఐ పి.సుబ్బారావు, ఎస్‌ఐ పి.నాగశివారెడ్డి సందర్శించి వివరాలు సేకరించారు. మృతురాలి సోదరుడు చీర్ల వెంకట్రావు ఫిర్యాదు మేరకు సీఐ పి.సుబ్బారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి:
పాపం చిన్నారి.. ఊయలే ఉరితాడై .. 
భార్యా భర్తల గొడవ.. బామ్మర్తి చేతిలో బావ హతం

 

మరిన్ని వార్తలు