ఒకే పీఎస్‌ పరిధి నుంచి నెలలో 28 మంది బాలికలు అదృశ్యం

6 Jul, 2021 08:18 IST|Sakshi

‘మిస్సింగ్‌’... కారణాలు అనేకం

సైదాబాద్‌ పరిధిలో స్లమ్స్‌ అనేకం

నిరక్షరాస్యతకు తోడు పేదరికం

సాక్షి, హైదరారబాద్‌: ఒకే పోలీసుస్టేషన్‌ పరిధి నుంచి నెల రోజుల కాలంలో 28 మంది బాలికలు అదృశ్యమయ్యారు. దీని వెనుక ఏదో ఉంది... అంటూ ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన పోస్టు పోలీసులకు తలనొప్పి తెచ్చి పెట్టింది. ఈ విషయంలో అసలేం జరిగిందంటూ ఆరా తీయగా..  

స్లమ్‌ ఏరియాలు అత్యధికం.
హైదరాబాద్‌ తూర్పు మండల పరిధిలోని మలక్‌పేట డివిజన్‌లో ఉన్న సైదాబాద్‌ పోలీసుస్టేషన్‌ పరిధి మూడు చదరపు కిలోమీటర్లు ఉంది. ఇందులో మూడు లక్షలకు పైగా జనాభా నివసిస్తుండగా... ప్రతి రోజూ 30 వేల నుంచి 40 వేల మంది వచ్చిపోతుంటారు. ఈ ఠాణా పరిధిలోని వచ్చే ప్రాంతాల్లో అత్యధికం స్లమ్‌ ఏరియాలు ఉన్నాయి. వీటిలో సింగరేణి కాలనీ, కాజాబాగ్, శంకేశ్వరిబజార్, చింతల్‌ల్లోని కీలకం. ఇక్కడ నివసించే వారిలో పేదలు, నిరక్షరాస్యులే ఎక్కువగా ఉన్నారు. ఇదే ఈ ఠాణాకు మిస్సింగ్‌ల సమస్య తెచ్చి పెట్టింది. కొందరు ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారం, కుటుంబ కలహాల కారణంగానూ ఇల్లు వదులుతున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుల ఆ«ధారంగా మిస్సింగ్‌ కేసులు నమోదు చేసుకుంటున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.  

ఇవీ గణాంకాలు... 
సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ జనవరి 1 నుంచి జూన్‌ 30 వరకు మొత్తం 44 మిస్సింగ్‌ కేసులు ఉన్నాయి. ఇందులో మైనర్‌ అమ్మాయిలకు సంబంధించినవి 9 కాగా... 8 కొలిక్కి వచ్చాయి. వీటిలో ఆరు కేసుల్లో మైనర్లను మేజర్లు వివాహం చేసుకున్నట్లు తేలడంతో పోక్సో చట్టం కింద కేసులు మార్చారు. 

18–85 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలు తప్పిపోయిన కేసులు 23 నమోదయ్యాయి. వీటిలో 19 కొలిక్కిరాగా.. నాలుగు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ మహిళల్లో 80 ఏళ్ళు పైబడిన ఇద్దరు వృద్ధాశ్రమం నుంచి వెళ్లిపోయారు. పది మంది మేజర్లు ప్రేమ వివాహాలు చేసుకుని తిరిగి వచ్చారు. 18 ఏళ్ళు పైబడిన పురుషులు 12 మంది మిస్సింగ్‌పై కేసులు నమోదయ్యాయి. వీటిలో 11 ట్రేస్‌ కాగా.. ఒకటి పెండింగ్‌లో ఉంది. ఇతను మానసిక రోగి అందుకే ఆచూకీ దొరకడంలేదు. 

ప్రతి ఫిర్యాదు కేసుగా నమోదు
మిస్సింగ్‌కు సంబంధించి వచ్చినన ప్రతి ఫిర్యాదునూ కేసుగా నమోదు చేస్తున్నాం. వారి ఆచూకీ కోసం అధికారిక సోషల్‌మీడియాలో పోస్టు చేస్తున్నాం. స్లమ్స్‌లో మిస్సింగ్స్‌ ఎక్కువగా జరగడానికి కారణాలు విశ్లేషించాం. ఆ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి, వారిలో అవగాహనకు కృషి చేస్తున్నాం. 
– కస్తూరి శ్రీనివాస్, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్, సైదాబాద్‌   

మరిన్ని వార్తలు