‘నేను పోలీసుని.. మీ గురించి ఇంట్లో వాళ్లకు చెప్తాను’

23 Mar, 2021 13:05 IST|Sakshi

పార్కులకు వచ్చే వారిని బెదిరించి డబ్బు వసూలు 

రాంగోపాల్‌పేట్‌: పోలీసునని చెప్పి నెక్లెస్‌ రోడ్డుకు వచ్చే జంటలను బెదిరించి డబ్బు, నగదును బలవంతంగా తీసుకుని వెళుతున్న ఓ పాత నేరస్తుడిని మహంకాళి పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ కావేటి శ్రీనివాస్‌ తెలిపిన మేరకు.. బోరబండకు చెందిన మరాఠి సృజన్‌కుమార్‌ (45) పాత నేరస్తుడు. విలాసాలకు అలవాటు పడిన సృజన్‌ సులభంగా డబ్బు సంపాదించడం కోసం నెక్లెస్‌రోడ్‌తో పాటు నగరంలోని వివిధ పార్కులకు వచ్చే జంటలను టార్గెట్‌ చేసేవాడు. పార్కులకు వెళ్లి అక్కడ ఉండే జంటకు తాను పోలీసునని చెప్పి మీ విషయం మీ ఇంట్లో వారికి చెబుతానని బెదిరించే వాడు. కేసు లేకుండా చేయాలంటే తాను అడిగినంత డబ్బు ఇవ్వాలని డిమాండ్‌ చేసేవాడు.

ఇలాగే ఈ నెల 15వ తేదీన ఓ జంట నెక్లెస్‌రోడ్‌లో ఉండగా నిందితుడు వెళ్లి తాను పోలీసునని ఇక్కడేం చేస్తున్నారని బెదిరించాడు. పోలీస్‌ స్టేషన్‌కు తీసుకుని వెళతానని మీ ఇంట్లో వాళ్లని పిలిపించాలని చెప్పాడు. అలా చేయకూడదంటే తనకు రూ.2లక్షల డబ్బు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విషయం ఇంట్లో తెలిస్తే బాగుండదని నగదు ఇచ్చేందుకు వారు సిద్ధద్దమయ్యారు. అయితే అంత డబ్బ తమ వద్ద లేని చెబితే వారిని ప్యాట్నీ సెంటర్‌లోని చందన బ్రదర్స్‌ షోరూమ్‌కు తీసుకుని వెళ్లి రూ.2 లక్షల విలువ చేసే 45 గ్రాముల బంగారు నగలు కొనుగోలు చేశాడు. వాటి బిల్లును ఈ జంట ఏటీఎం కార్డు నుంచి కట్టించాడు. తర్వాత తాము మోసపోయామని గ్రహించిన ఈ జంట మరుసటి రోజు మహంకాళి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న డీఐ పురుషోత్తం డీఎస్‌ఐ నరేష్‌తో కలిసి ధర్యాపుత చేపట్టి నిందితున్ని సోమవారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 22 గ్రాముల బంగారంతో పాటు మొబైల్‌ ఫోన్, పల్సర్‌ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై నగరంలో నగరంలో 12, విశాకపట్టణంలో 4, వరంగల్‌లో 1 రాబరీ, కిడ్నాప్‌ కేసులు నమోదై ఉన్నాయి.  

చదవండి: హైదరాబాద్‌లో ‘ఫ్రీ చాయ్‌ బిస్కెట్‌’: ఎక్కడంటే?

మరిన్ని వార్తలు