Hyderabad: అమాయక మహిళలను మోసం చేస్తూ వ్యభిచార నిర్వహణ

8 Jul, 2022 11:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వ్యభిచారం నిర్వహిస్తూ అమాయక మహిళలను మోసం చేసిన ఓ మహిళపై రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ గురువారం పీడీ యాక్టు నమోదు చేశారు. జవహర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సిరిగాడి అరుణ దమ్మాయిగూడ వాయుశక్తినగర్‌లో ఓ ఇంట్లో నివాసం ఉంటూ కళాశాల యువతులు, ఒంటరి మహిళలకు జీవనోపాధి కల్పిస్తానని చెప్పి వ్యభిచారం నిర్వహిస్తుంది. వ్యభిచారం నిర్వహిస్తున్న అరుణను జూన్‌ 16న పోలీసులు అదుపులోకి తీసుకొని చంచల్‌గూడ జైలులో తరలించారు. ఈ మేరకు అరుణపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు తెలిపారు.

మసాజ్‌ సెంటర్‌పై దాడి.. ముగ్గురు మహిళల అరెస్టు 
అనుమతి లేకుండా మసాజ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న బ్యూటీ సెలూన్‌ వెల్‌నెస్‌ సెంటర్‌పై ఎస్‌ఓటీ పోలీసులు దాడులు చేసి ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్న ఘటన వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం  ప్రకారం.. పనామా చౌరస్తాకు వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న ఎస్‌బీ బ్యూటీ అండ్‌ సెలూన్‌ వెల్‌నెస్‌ సెంటర్‌లో అనుమతి లేకుండా మసాజ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నట్టు పక్కా సమాచారం అందంది.

దీంతో ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ, వనస్థలిపురం పోలీసులు సంయుక్తంగా బుధవారం దాడి చేశారు. అందులో పనిచేస్తున్న ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. మసాజ్‌ సెంటర్‌ నిర్వాహకుడు రాధామనోహర్‌రెడ్డి, మేనేజర్‌  ప్రశాంత్‌లు  పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ వారి నుంచి 4 సెల్‌ఫోన్లు, రూ. 500 నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు