ఇల్లు అద్దెకు కావాలంటూ రూ.1.95లక్షలు లూటీ 

26 Oct, 2021 15:11 IST|Sakshi

సాక్షి, హిమాయత్‌నగర్‌: ఆర్మీ అధికారినని చెప్పి ఓ వ్యక్తి తన అకౌంట్‌ నుంచి డబ్బులు కాజేశాడంటూ వెస్ట్‌ మారేడ్‌పల్లికి చెందిన ఓ మహిళ సోమవారం సిటీ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ ఇంటిని రూ.10 వేలకు అద్దెకు ఇస్తున్నట్లు ఓఎల్‌ఎక్స్, మ్యాజిక్‌బ్రిక్స్‌లో యాడ్‌ పోస్ట్‌ చేశామన్నారు. ఇది చూసిన ఓ వ్యక్తి తాను ఆర్మీ అధికారినని, ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బదిలీపై వస్తున్నట్లు చెప్పాడు. మీ ఇల్లు నచ్చింది మీకు ఫోన్‌ పే లింకు పంపుతున్నాను యాక్సెప్ట్‌ చేస్తే ముందుగానే డబ్బులు ఇస్తానని నమ్మించి, లింకు పంపాడు. లింకును ఓపెన్‌ చేశాక తన అకౌంట్‌లో ఉన్న రూ.లక్షా 95వేలు కాజేసినట్లు తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

విదేశీ కరెన్సీతో పట్టుబడ్డ మహిళ 
శంషాబాద్‌: విదేశీ కరెన్సీని అక్రమంగా తరలిస్తున్న మహిళా ప్రయాణికురాలిని శంషాబాద్‌ విమానాశ్రయలో సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఈకే–275 విమానంలో అబుదాబి వెళ్లడానికి వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి లగేజీని సాధారణ తనిఖీల్లో భాగంగా సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు పరిశీలించారు. అందులో 50,500 సౌదీ రియాల్స్‌ (భారత కరెన్సీ విలువలో రూ.9.77 లక్షలు) బయటపడ్డాయి. దీంతో సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు మహిళను కస్టమ్స్‌ అధికారులకు అప్పగించారు. ఫెమా చట్టం కింద మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు