‘మమ్మీ.. డాడీ నన్ను క్షమించండి.. నేను కరెక్ట్‌గా లేను’

10 Jun, 2022 07:54 IST|Sakshi
ఖాజా మోహినూద్ధీన్‌ (ఫైల్‌)  

సాక్షి, హైదరాబాద్‌: మమ్మి, డాడీ నన్ను క్షమించండి, మీరు కరెక్ట్‌గా ఉన్నారు. నేను కరెక్టుగా లేను, నేనేమీ చేయలేను... నేను మిమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నా.. అమ్మా.. నన్ను క్షమించు మీరు నా ప్రాణం... మీకు అందనంత దూరం వెళ్లిపోతున్నా అంటూ లోన్‌ యాప్స్‌ ద్వారా రుణం తీసుకున్న ఓ యువకుడు సూసైడ్‌నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విధారక సంఘటన జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటుచేసుకుంది.

జవహర్‌నగర్‌ పోలీసులు, స్ధానికులు తెలిపిన మేరకు.. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఖాధర్‌ కుటుంబ సభ్యులతో కలిసి చెన్నాపురంలోని సాయిగణేష్‌ కాలనీలో పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ముర్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఖాజా మోహినుద్దీన్‌ (23) ఉన్నారు. ఇద్దరు కుమార్తెల వివాహం జరిగింది. మదర్సాలో చదువుతున్న ఖాజా ఇంట్లో ఆన్‌లైన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం ఖాజా ఫోన్‌తో పాటు ఇంట్లో ఉన్న తండ్రికి ఫోన్‌ ద్వారా లోన్‌ యాప్‌ నుంచి రూ. లక్ష లోన్‌ తీసుకున్నాడు.

అసలు వడ్డీ లోన్‌కు సంబంధించి రూ. 40 వేలు కట్టాలని లోన్‌యాప్‌ నిర్వాహకులు  వేధింపులకు గురిచేశారు. దీంతో తండ్రి కొంత డబ్బును కట్టాడు. ఈ నెల 8న ఖాజాను తండ్రి మందలించాడు. జీతం వస్తుంది కడతానని చెప్పాడు. అదేరోజు ఖాజా తల్లిదండ్రులు సోదరి ఒక గదిలో నిద్రిస్తుండగా వంటగదిలోకి వెళ్లిన ఖాజా మోహినూద్ధీన్‌ సూసైడ్‌నోట్‌ రాసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
చదవండి: ట్రాప్‌ చేసింది ప్రజాప్రతినిధుల కుమారులే!

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు