మహిళ ప్రాణం తీసిన కారు రేసింగ్‌ 

15 Feb, 2023 04:24 IST|Sakshi

మణికొండ: అతిగా మద్యం సేవించి మూడు కార్లతో రేసింగ్‌ పెట్టుకున్న విద్యార్థులు ఓ మహిళ ప్రాణం తీసిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జన్వాడ వద్ద మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శాంతమ్మ (55) అనే మహిళ భర్త నర్సింహులుతో కలిసి స్కూటీపై మంగళవారం సాయంత్రం ఇంటికి వెళుతుంది. అదే సమయంలో వెనకనుంచి వచ్చిన ఓ కారు వేగంగా ఢీ కొనడంతో ఆమె ఎగిరి పడింది.

ఆమెకు తీవ్ర గాయాలు కావటంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఐబీఎస్‌ కళాశాల విద్యార్థులు అతిగా మద్యం తాగి మూడు కార్లతో ప్రధాన రోడ్డుపై రేసింగ్‌ పెట్టుకున్నారు. అందులో భాగంగా అతివేగంగా వెళుతున్న ఓ కారు స్కూటీని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శాంతమ్మ భర్త నర్సింహులు స్వల్పగాయాలయ్యాయి. మృతురాలి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ప్రమాదానికి కారణమైన వ్యక్తులను ఇంకా గుర్తించలేదని ఎస్సై కృష్ణయ్య తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించామన్నారు.   

మరిన్ని వార్తలు