ఒంటికి శానిటైజర్‌ రాసుకున్న చిన్నారి

26 Feb, 2023 08:00 IST|Sakshi

సాక్షి,అంబర్‌పేట(బెంగళూరు): శానిటైజర్‌ ఓ నాలుగేళ్ల పాప ప్రాణం మీదికి తెచ్చింది. ఒంటికి రాసుకున్న శానిటైజర్‌కు మంటలు అంటుకోవడంతో చిన్నారి మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన శనివారం కాచిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ రామ్‌లక్ష్మణ్‌రాజ్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.అంబర్‌పేట 6 నెంబర్‌లో నివాసం ఉంటున్న జగనాథం, రాజేశ్వరీ దంపతులకు అక్షర, ప్రీతి(4) ఇద్దరు కుమార్తెలు.

రాజేశ్వరీ ఇద్దరు కుమార్తెలతో కలిసి కృష్ణానగర్‌లో ఉంటున్న పుట్టింటికి వచ్చింది. శనివారం రాజేశ్వరీ ఇంట్లో నిద్రిస్తుండగా అక్కాచెలెళ్లు  ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఒంటికి శానిటైజర్‌ రాసుకున్న ప్రీతి ఆడుకునే క్రమంలో దేవుడి వద్ద వెలుగుతున్న దీపం దగ్గరికి వెళ్లడంతో మంటలంటుకున్నాయి. దీనిని గుర్తించిన ఆమె అక్క అక్షర కేకలు వేయడంతో నిద్ర మేల్కొన్న తల్లి రాజేశ్వరీ నీళ్లు చల్లి మంటలు ఆర్పివేసింది. చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: పెనం మీద నుంచి పొయ్యిలోకి ప్రపంచం..!

మరిన్ని వార్తలు