ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం; ఆరుగురు మృతి

10 Nov, 2020 06:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంగారెడ్డి జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. పఠాన్‌ చెరు మండలం పాటి ఓఆర్‌ఆర్‌ రింగ్‌ రోడ్డుపై జైలో వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు వ్యక్తులు సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో మొత్తం 10 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వీరందిరినీ జార్ఖండ్‌కు చెందిన కార్పెంటర్లుగా గుర్తించారు. మృతుల్లో రాంఘడ్‌కు చెందిన కమలేష్ లోహరే, హరి లోహరే, ప్రమోద్ భుహెర్, వినోద్ భుహెర్,  పవన్ కుమార్ (ఘోరఖ్‌పూర్‌), బంగ్లాదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఉన్నట్లు సమాచారం.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ పుటేజీల ఆధారంగా ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా.. బాధితులంతా గచ్చిబౌలి నుంచి జార్ఖండ్‌కు వెళ్తుండగా రింగ్‌ రోడ్డుపై ప్రమాదం జరిగిననట్లు తెలుస్తోంది. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు