మున్నాభాయ్‌ వర్సిటీ..! పది నుంచి పీహెచ్‌డీ దాకా.. ఏది కావాలన్నా రెడీ

25 Sep, 2022 05:03 IST|Sakshi

నిరుద్యోగులే లక్ష్యంగా రెచ్చిపోతున్న నకిలీ ధ్రువపత్రాల మాఫియా

ఇటీవలి కాలంలో భారీ ఫేక్‌ సర్టిఫికెట్‌ రాకెట్ల గుట్టురట్టు చేసిన పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయడం చూశాం.. కాపీ కొట్టి పరీక్ష రాసి టాప్‌ ర్యాంకులు పొందిన వారినీ చూశాం.. కానీ ఏ కోర్సు చదవకుండానే ఎంబీబీఎస్, ఎంటెక్, పీహెచ్‌డీ... ఇలా ఏ సర్టిఫికెట్‌ కావాలన్నా చిటికెలో రూపొందించి ఇస్తున్న ముఠాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. పదో తరగతి నుంచి పీహెచ్‌డీ, ప్రొఫెషనల్‌ కోర్సుల సర్టిఫికెట్ల దాకా ఏదైనా తయారుచేసి నిరుద్యోగ యువతను కటకటాల్లోకి వెళ్లేలా చేస్తున్నాయి.

సర్టిఫికెట్‌ను బట్టి రేటు..
కూకట్‌పల్లికి చెందిన నవీన్‌ (పేరు మార్చాం) డిగ్రీ సర్టిఫికెట్‌ కావాలని తన స్నేహితుడు కరణ్‌ (పేరు మార్చాం)కి అడి గాడు. తనకు తెలిసిన విజయవాడ స్నేహితుడు రామ్మో హన్‌ను కలిస్తే పని అవుతుందని, యూపీలోని ఓ యూని వర్సిటీ నుంచి బీకాం సర్టిఫికెట్‌ తెప్పిస్తాడని చెప్పాడు. రామ్మోహన్‌కు కాల్‌ చేయగా రూ.1.2 లక్షలు ఖర్చువుతుందనగా... తాను 90 వేలు ఇవ్వగలను అన్నాడు.

ఆ మేరకు డబ్బులివ్వగా వారంలోనే సర్టిఫికెట్‌ ఇచ్చాడు. ఇలా ముఠాలు నిరుద్యోగ యువత అవసరాన్ని ఆసరాగా చేసుకొని పేర్లు కూడా సరిగ్గా తెలియని యూనివర్సిటీల పేరిట నకిలీ సర్టిఫికెట్లు ఇస్తున్నాయి. పదో తరగతి సర్టిఫికెట్‌కు రూ.లక్ష, ఇంటర్‌ రూ.80 వేలు, డిగ్రీకి కనీసం రూ.లక్ష, బీటెక్‌ అయితే రూ.2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు రాచకొండ, సైబరాబాద్‌ పోలీసుల విచారణలో బయటపడింది.

వరుస కేసులతో గుట్టురట్టు..
ఈ ఏడాది జూన్, జూలై, ఆగస్టులో సైబరాబాద్, రాచకొండ పోలీసులు నకిలీ సర్టిఫికెట్‌ రాకెట్ల గుట్టురట్టు చేసి పలువురిని కటకటాల పాలుచేశారు. జూలైలో గ్యాంగ్‌ సూత్రధారిగా ఉన్న విజయవాడకు చెందిన ప్రైవేట్‌ టీచర్‌ కోటా కిషోర్‌ వివిధ బోర్డులు, యూనివర్సిటీల పేరిట నకిలీ సర్టిఫికెట్లు అమ్ముతున్నట్టు గుర్తించి 11మందిని అరెస్ట్‌ చేశారు. 18 వర్సి టీలు, 13 రాష్ట్రాల బోర్డుల పేరిట వందల సర్టిఫికెట్లు సృష్టించి డబ్బులు దండుకున్నట్టు గుర్తించారు.

ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లాలనుకున్న వారిని టార్గెట్‌ చేసు కొని నకిలీలు రూపొందించిన ఏడుగురిని గత ఆగస్టులో అరెస్ట్‌చేశారు. రూ.25 వేల నుంచి 5 లక్షల వరకు తీసుకొని 500 మందికి నకిలీ సర్టిఫికెట్లు, రికమెండేషన్‌ లెటర్లు సమకూర్చి నట్టు వెలుగులోకి వచ్చింది. అలాగే, విదేశాలకు వెళ్లా లనుకునే వారికి బీటెక్, ఎంటెక్‌ సర్టిఫి కెట్లు రూపొందించి లక్షలు సొమ్ము చేసుకున్నట్టు బయటపడింది.

అమెరికా, యూకే, కెనడా వెళ్లేందుకు వీసాలు ప్రాసెస్‌ చేస్తా మని చైతన్యపురిలో కన్సల్టెన్సీ బోర్డు పెట్టి నకిలీలు రూపొందించిన ముఠాను అరెస్ట్‌ చేశారు. కాక తీయ, ఉస్మానియా, ఆచార్య నాగార్జున, జేఎన్‌టీయూ వర్సిటీల ఒరిజినల్‌ సర్టిఫికెట్లను స్కాన్‌ చేసి నకిలీలు సృష్టి స్తూ వీసాలకు డాక్యుమెంట్లను రూపొందించిన వ్యవహా రా న్ని పోలీసులు బయటపెట్టారు. ఈ ముఠాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్, ఇంజనీ రింగ్‌ పూర్తిచేసిన ఓ మహిళ, మరో ఇద్దరు నిరుద్యోగులను కటకటాల్లోకి నెట్టినట్టు పోలీసులు తెలిపారు. 

గల్లీకో కన్సల్టెన్సీ..
ఎలాగైనా విదేశాలకు వెళ్లి సెటిల్‌ అవ్వాలని అక్రమ మార్గాలను ఎంచుకుంటున్న యువతకు ఈ కన్సల్టెన్సీలు ఆశాదీపంగా కనిపిస్తున్నాయి. పైగా ఎంత డిమాండ్‌ చేస్తే అంత మొత్తంలో డబ్బులు దండుకోవచ్చన్న అత్యాశతో మోసాలకు పాల్ప డుతున్నారు. గల్లీకో కన్సల్టెన్సీ పేరిట అందమైన ఆఫీసులు పెట్టి బురిడీ కొట్టిస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే 2వేలకు పైగా ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీ లున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇందులో సగానికి పైగా కన్సల్టెన్సీలు అక్రమ మార్గాల్లో విద్యార్థులను విదేశాలకు పంపుతున్నట్టు తెలుస్తోంది. కొంతమంది ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఉన్నా వీసా రాదనే భయంతో కన్సల్టెన్సీలను సంప్రదిస్తున్నారు. 

మరిన్ని వార్తలు