హమ్మయ్యా, నవీన్‌ దొరికాడు.. కానీ ఎంజీబీఎస్‌ నుంచి మిర్యాలగూడకు ఎలా వెళ్లాడు?

12 May, 2022 13:24 IST|Sakshi

ఎంజీబీఎస్‌లో కిడ్నాపైన బాలుడు  తల్లిదండ్రులకు అప్పగింత

మిర్యాలగూడ బస్సులో తిరిగి ఎంజీబీఎస్‌కు చేరిన చిన్నారి

సాక్షి,అఫ్జల్‌గంజ్‌(హైదరాబాద్‌): మహాత్మాగాంధీ బస్‌ స్టేషన్‌లో అపహరణకు గురైన మూడేళ్ల నవీన్‌ ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరుకున్నాడు. ఈ నెల 9న తన తండ్రి లక్ష్మణ్‌తో కలిసి అన్నమయ్య జిల్లాలోని సొంతూరికి వెళ్లేందుకు ఎంజీబీఎస్‌కు వచ్చాడు. తండ్రి మూత్రశాలకు వెళ్లొచ్చే సరికి గుర్తుతెలియని వ్యక్తి అతడిని అపహరించి అక్కడి నుండి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అగంతకుడు బాలుడి చేయి పట్టుకొని తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి.

వీటి ఆధారంగా పోలీసులు బాలుడి కోసం గాలింపు చేపట్టారు. అయితే సదరు బాలుడు మిర్యాలగూడకు చెందిన ఆర్టీసీ బస్సులో తిరిగి మంగళవారం అర్థరాత్రి ఎంజీబీఎస్‌కు చేరుకున్నాడు. ఎంజీబీఎస్‌కు చేరుకున్న బస్సులోని ఓ సీటులో నిద్రిస్తున్న బాలుడిని గుర్తించిన కండక్టర్‌ పోలీసులకు సమాచారం అందించాడు. ఆ బాలుడిని చేరదీసిన అఫ్జల్‌గంజ్‌ పోలీసులు అదే రాత్రి ఉస్మానియా ఆసుపత్రిలో  వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాప్‌ చేసిన వ్యక్తి కోసం గాలింపు ముమ్మరం చేశామని, ఎంజీబీఎస్‌ నుంచి మిర్యాలగూడకు ఎలా వెళ్లాడనే కోణంలో సైతం దర్యాప్తు చేస్తున్నట్లు అఫ్జల్‌గంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ రెడ్డి తెలిపారు.

చదవండి: బ్యాంక్‌కు షాకిచ్చిన క్యాషియర్‌.. ఐపీఎల్‌ బెట్టింగ్‌లో..

మరిన్ని వార్తలు