అనుమానాస్పదంగా విద్యార్థి ఆత్మహత్య

23 Dec, 2021 10:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: నిజాంపేట్‌: బాచుపల్లిలోని వీఎన్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద మృతి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. నాగర్‌కర్నూలు జిల్లా మాదవన్‌పల్లికి చెందిన సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ సత్యనారాయణ, అరుణ దంపతుల కుమారుడు శివనాగులు బాచుపల్లిలోని వీఎన్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో బీటెక్‌ సీఎస్‌ఈ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నాడు. 20 రోజుల క్రితం వీఎన్‌ఆర్‌ కాలే జీæ హాస్టల్‌లో చేరాడు. కాగా గురువారం ఉదయం శివనాగులు హాస్టల్‌ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని హాస్టల్‌ నిర్వాహకులు విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

దీంతో బాచుపల్లిలో నివాసముండే శివనాగులు మేనమామ ప్రకాష్‌ హుటాహుటిన హా స్టల్‌ దగ్గరకు వచ్చాడు. అయితే సుమారు 30 నిమిషాలు అతన్ని హాస్టల్‌ సిబ్బంది లోపలికి అనుమతించ లేదు. అప్పటికే మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఏబీవీపీ, బీజేపీ నాయకులు కాలేజ్‌ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. అయితే పోలీసులకు సంఘటన స్థలంలో లభించిన సూసైడ్‌ నోట్‌లో తనకు జీవితంపై విరక్తి వచ్చిందని, అందుకే తాను ఆత్మహత్య చేసు కుంటున్నానని, కుటుంబ సభ్యులు తనను క్షమించాలని కోరినట్లు అందులో ఉంది. మృతుడి తండ్రి సత్యనారాయణ మాట్లాడుతూ తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాడని, ఇతర ఎలాంటి సమస్యలు లేవని, సుసైడ్‌ నోట్‌లో ఉన్న హ్యాండ్‌ రైటింగ్‌ తమ బిడ్డది కాదని పేర్కొన్నారు. 

విద్యార్థి సంఘాల ధర్నా.. లాఠీ చార్జ్‌.. 
విషయం తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు విద్యార్థి మృతిపై అనుమానాలున్నాయంటూ కాలేజ్‌ గేట్‌ ముందు ధర్నా చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న వారిపై లాఠీ చార్జ్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కాలేజ్‌ యాజమాన్యం కనీసం విద్యార్థి మృతికి సంతాపం కూడా తెలపక పోవడం సిగ్గుచేటని ఏబీవీపీ నాయకులు అన్నారు. మధ్యాహ్నం తరువాత స్పందించిన కాలేజ్‌ యాజమాన్యం సెలవు ప్రకటించింది.  

లాఠీ చార్జిపై శ్రీశైలంగౌడ్‌ ఆగ్రహం.. 
విద్యార్థి అనుమానాస్పద మృతిపై నిరసన తెలిపిన ఏబీవీపీ నాయకులపై పోలీసులు లాఠీచార్జి చేయడంపై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కూన శ్రీశైలంగౌడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. అదేవి ధంగా మేడ్చల్‌ జిల్లా బీజేపీ అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి, నిజాంపేట్‌ మున్సి పల్‌ అ«ధ్యక్షుడు సతీష్‌లు పోలీసులు, కళాశాల యాజమాన్యం ప్రవర్తించిన తీరుపై మండి పడ్డారు. అదే విధంగా సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమామహేష్, మండల కార్యదర్శి శ్రీనివాస్‌లు కళాశాల వద్దకు చేరుకుని విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.  

అర్ధరాత్రి వరకు హాస్టల్‌లో ఫ్రెషర్స్‌ పార్టీ.. 
వీఎన్‌ఆర్‌ హాస్టల్‌లో బుధవారం రాత్రి ఫ్రెషర్స్‌ పార్టీ జరిగినట్లు సమాచారం. ఆ పార్టీ అర్ధరాత్రి వరకు కొనసాగిందని, ఈ నేపథ్యంలో సీనియర్‌ విద్యార్థులు ర్యాగింగ్‌ చేసినందుకు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడా.. లేదా ఇతరాత్రా కారణాలేమైనా ఉన్నాయా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడితే అసలు విషయం బయటపడే అవకాశముంది.  

మరిన్ని వార్తలు