వ్యాపారంలో తలెత్తిన వివాదం.. రూ.లక్ష సుపారి ఇచ్చి అంతమొందించాడు

24 Jul, 2021 09:09 IST|Sakshi

సాక్షి, గోల్కొండ(హైదరాబాద్‌): రియల్‌ ఎస్టేట్‌ వివాదాల నేపథ్యంలో భాగస్వామిని హత్య చేసిన వ్యక్తితో పాటు హత్యలో పాల్గొన్న సుపారి హంతకులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. గోల్కొండ పోలీసులు తెలిపిన మేరకు.. షేక్‌పేట్‌ గుల్షన్‌ కాలనీకి చెందిన నసీర్‌ అహ్మద్‌  ఓయూలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన రషీద్‌ ఖాన్‌తో కలిసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. అయితే సంవత్సరం నుంచి వీరి మధ్య వివాదం నెలకొంది. తనకు రూ. 2 కోట్లు ఇవ్వాలని రషీద్‌ ఖాన్‌.. నసీర్‌ అహ్మద్‌తో చెప్పేవాడు.

అయితే డబ్బులు ఇచ్చేది లేదని నసీర్‌ అహ్మద్‌ ఖరాఖండిగా తేల్చేశాడు. దీంతో కక్ష పెంచుకున్నాడు. తన తమ్ముడు అంజద్‌ ఖాన్‌తో రషీద్‌ పథకం వేశాడు. రషీద్‌ ఆదేశాల మేరకు అంజద్‌ ఖాన్‌ సయ్యద్‌ షా అక్బర్‌ అలీ, నియాజ్‌ మహ్మజ్‌ హాజీ, మీర్జా ఫయాజ్‌ అలీ బేగ్, ఉమర్‌ ఫారూక్‌  రూ.లక్షకు సుపారి ఇచ్చి అంతమొందించాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంజద్, రషీద్‌ ఆదేశాల మేరకు సుపారి హంతకుల ముఠా ఈనెల 2న గుల్షన్‌ కాలనీలో స్కూటర్‌ పై వెళ్తున్న నసీర్‌ అహ్మద్‌ను కత్తులతో పొడిచి పారిపోయారు. కాగా నసీర్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రషీద్‌ఖాన్, అంజద్‌ ఖాన్‌తో పాటు సయ్యద్‌ షా, అక్బర్‌ అలీ, నియాజ్‌ మహ్మద్‌ హాజి, మీర్జా ఫయాజ్‌ అలీబేగ్, ఉమర్‌ ఫారూక్‌లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు