చూయింగ్‌గమ్, చెప్పుల్లో బంగారం స్మగ్లింగ్‌

14 Mar, 2021 03:42 IST|Sakshi

సాక్షి, శంషాబాద్‌: ఎయిర్‌పోర్టులో నలుగురు ప్రయాణికుల నుంచి కస్టమ్స్‌ అధికారులు 471 గ్రాముల బంగారం, ఒక ఉంగరం స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి షార్జా నుంచి 6ఈ–1406 విమానంలో వచ్చిన నలుగురు ప్రయాణికుల లగేజీలను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేయగా ఏమీ దొరకలేదు. అయితే వారి కదలికలు, మాటల తీరు అనుమానించిన అధికారులు నోట్లో తనిఖీ చేశారు.

నలుగురి నోట్లో ఉన్న చూయింగ్‌ గమ్‌ను బయటకు తీయించగా, అందులో 471 గ్రాముల చిన్న చిన్న ముక్కలుగా ఉన్న బంగారంతో పాటు ఒక ఉంగరం బయటపడింది. ఈ బంగారం విలువ సుమారు రూ.20.67 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. అలాగే షార్జా నుంచి ఎయిర్‌ అరేబియా జి–9458 విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి చెప్పుల్లో 694 గ్రాముల బంగారం బయటపడింది. ఈ చెప్పులను కవర్లు, కార్బన్‌ పేపర్లతో ప్రత్యేకంగా తయారు చేయించినట్లు అధికారులు గుర్తించారు. ఈ బంగారం విలువ రూ.27.04 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు