మహిళ కిడ్నాప్‌.. సామూహిక అత్యాచారం..జహీరాబాద్‌కు ఎలా వచ్చింది?

26 Sep, 2022 08:19 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,హైదరాబాద్‌: కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన మహిళ(27)ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళకు మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డట్టు సమాచారం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌–దిడిగి గ్రామ శివారులోని ఓ వెంచర్‌లో శనివారం ఓ మహిళ మద్యం మత్తులో పడి ఉండగా దారిన వెళ్లే వారు చూసి ఆమెను జహీరాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకొచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను సంగారెడ్డిలోని సఖి కేంద్రానికి తరలించారు. ఈ విషయమై డీఎస్పీ రఘును వివరణ కోరగా మహిళ మద్యం మత్తులో ఉండడంతో వివరాలు వెల్లడించడం లేదన్నారు. ఇందుకు సంబంధించి కిడ్నాప్, అత్యాచారం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. బాధితురాలు పూర్తి వివరాలు సరిగ్గా చెప్పడం లేదన్నారు. తన స్వస్థలం ఒకసారి కూకట్‌పల్లి అని, మరోసారి బాలానగర్‌ అని చెబుతోందన్నారు.

జహీరాబాద్‌కు ఎలా వచ్చింది..
ఎవరితో వచ్చిందనే వివరాలను కూడా చెప్పడం లేదన్నారు. మద్యం మత్తులో ఉండడం వల్ల ఏమీ చెప్పలేకపోతుందన్నారు. విచారణలో పొంతన లేని సమాధానం ఇస్తోందన్నారు. తనకు ఇంకా పెళ్లి కాలేదని చెబుతోందన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం పంపించామని, ఇందుకు సంబంధించి రిపోర్టు రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం విచారణ చేపట్టామని, విచారణ అనంతరమే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. ఇదిలా ఉంటే మహిళ పరిస్థితి బట్టి చూస్తే గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేసి నిర్జన ప్రదేశానికి తీసుకొచ్చి సామూహిక అత్యాచారం జరిపి ఉంటారనే ప్రచారం సాగుతోంది. 
చదవండి: అసదుద్దీన్‌ ఫోన్‌ నంబర్‌ కోసం ముంబైలో ఆరా.. బాంబ్‌ బ్లాస్ట్‌ వార్నింగ్‌

మరిన్ని వార్తలు