ఇంట్లో అతీంద్రియ శక్తులు, పూజలు చేస్తే ఐశ్వర్యం మీ వశమని..

13 Aug, 2021 09:04 IST|Sakshi
ముగ్గురు నిందితులు జితేందర్‌, గని, దస్తగిరి

మీర్‌పేట( హైదరాబాద్‌): మీ ఇంట్లో అతీంద్రియ శక్తులు ఉన్నాయని, క్షుద్రపూజలు చేస్తే శక్తులు మీ వశమై ఐశ్వర్యం, సంపద మీకు దక్కుతుందని నమ్మించి మోసానికి పాల్పడిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌ గాంధీ నగర్‌కు చెందిన పిల్లి జితేందర్‌ (34) ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటాడు. మహారాష్ట్ర యావత్మాల్‌ జిల్లాకు చెందిన అబ్ధుల్‌ గని (48) వృత్తిరీత్యా కార్పెంటర్‌.

కుషాయిగూడ చీరాగల్లికి చెందిన మహ్మద్‌ దస్తగిరి (35) వస్త్ర వ్యాపారి. వీరు ముగ్గురు పథకం ప్రకారం 8నెలల క్రితం మీర్‌పేట సర్వోదయనగర్‌కు చెందిన కృష్ణవేణి ఇంటికి వచ్చి వారి ఇంట్లో అతీంద్రియ శక్తులు ఉన్నాయన్నారు. క్షుద్ర పూజలు చేయడం ద్వారా ఆ శక్తులు వారి సొంతమవుతాయని చెప్పారు. అవి సొంతమైతే కుబేరులవుతారని వారిని నమ్మించారు. క్షుద్ర పూజలు చేసేటప్పుడు బంగారు ఆభరణాలు, నగదు ఉంచాలని తెలిపారు. వారు ఐదున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.11లక్షల నగదును మూటలో కట్టి ఉంచారు. క్షుద్రపూజలు చేసిన అనంతరం పూజ ముగిసిందని అక్కడి నుంచి జారుకున్నారు. వారు వెళ్లాక మూటను విప్పి చూడగా అందులోని బంగారం, నగదు కనిపించకపోవడంతో షాక్‌కు గురై మోసపోయినట్లు గ్రహించారు. 
ఆలస్యంగా వెలుగులోకి... 
ఈ సంఘటన జరిగిన 8 నెలల తరువాత ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. క్షుద్ర పూజల పేరిట మోసపోయినట్లు తెలుసుకున్న బాధిత కుటుంబం జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక, బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో ఎలాగోలా ధైర్యం చేసి జరిగిన మోసంపై ఆగస్టు 9వ తేదీన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు కృష్ణవేణి ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు క్షుద్రపూల పేరిట మోసానికి పాల్పడిన ముగ్గురు నిందితులు పిల్లి జితేందర్, అబ్ధుల్‌ గని, మహ్మద్‌ జితేందర్‌లను గురువారం అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.2.66 లక్షల నగదు, మూడు బంగారు నాణేలు, ఒక బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు