పెళ్లెప్పుడు చేసుకుంటావ్‌?

1 Jan, 2021 09:51 IST|Sakshi

ప్రియుడిని నిలదీసిన యువతి 

యువతిపై ప్రియుడి దాడి 

హెచ్చార్సీ ఎదుట ప్రేమికుల ఘర్షణ 

సాక్షి, హైదరాబాద్‌ : పెళ్లెప్పుడు చేసుకుంటావని నిలదీసినందుకు ఓ వ్యక్తి ప్రేమించిన యువతిపైనే దాడి చేశాడు. ఈ సంఘటన అబిడ్స్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌(హెచ్చార్సి) ఎదుట గురువారం జరిగింది. వనపర్తి జిల్లాకు చెందిన కమిరెడ్డి కవిత(28), కృష్ణా జిల్లాకు చెందిన భూక్యా అశోక్‌ కుమార్‌(30) ప్రేమించుకుంటున్నారు. కొద్దిరోజులుగా పెళ్లిచేసుకోవాలని కవిత అశోక్‌ను కోరుతోంది. సహజీవనం సాగించిన అశోక్‌ తప్పించుకుని తిరగడం మొదలుపెట్టాడు.

దీంతో అతనిపై జవహర్‌ నగర్‌  పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడితో మాట్లాడటంతో 20 రోజుల్లో పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే అతను ఇచ్చిన మాట తప్పడంతో బాధితురాలు హెచ్చార్సీని ఆశ్రయించింది. గురువారం విచారణకు హాజరైన భూక్యా అశోక్‌ కుమార్‌ను కాలర్‌ను ప్రియురాలు  పట్టుకుని నిలదీయడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.  ఈ క్రమంలో ప్రియుడు  అశోక్‌ కుమార్‌.. కవితపై దాడి చేశారు. ఈ దాడిలో కవిత కుడి చెయ్యికి స్వల్ప గాయాలు అయ్యాయి. అనంతరం పోలీసులు ఇరువురిని అబిడ్స్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు.  

మరిన్ని వార్తలు