సాక్షి, హైదరాబాద్(భాగ్యనగర్ కాలనీ): తనతో సహజీవనం చేసి..కొన్నేళ్లుగా దూరంగా ఉంచుతోందని కోపం పెంచుకున్న ఓ వ్యక్తి మహిళపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కూకట్పల్లి పోలీసులు తెల్పిన వివరాల మేరకు ప్రకాష్ నగర్లో నివాసం ఉంటున్న వెంకటలక్ష్మి నాచారంలోని ఈఎస్ఐ ఆస్పత్రిలో స్వీపర్ గా పనిచేస్తుంది. జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్న వెంకటేశ్ అనే వ్యక్తితో ఆమె మూడేళ్లు సహజీవనం చేసింది. కొద్దిరోజులుగా మనస్పర్థలు రావడంతో వీరు విడివిడిగా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో వెంకటలక్ష్మిపై కోపం పెంచుకున్న వెంకటేశ్ బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ప్రకాష్ నగర్లోని ఆమె నివాసానికి వచ్చి గొడవపడ్డాడు. అనంతరం ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో వెంకట్ లక్ష్మి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనలో వెంకటేశ్ సైతం తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.